న్యూఢిల్లీ, జూన్ 5: పేద, మధ్య తరగతి ప్రయాణికులను చౌకగా గమ్యస్థానాలకు చేర్చేవి రైళ్లు.. ప్రతి రోజు రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగేలా కేంద్రంలోని మోదీ సర్కారు మార్చి నుంచి మే మధ్య మూడు నెలల్లో ఏకంగా 9 వేల రైళ్లను రద్దు చేసింది. వాటిలో 1,934 రైళ్లను (20 శాతానికి పైగా) కేవలం బొగ్గును సరఫరా చేసే గూడ్స్ రైళ్ల కోసం రద్దు చేసింది. 6,995 రైళ్లను నిర్వహణ పనులు లేదా నిర్మాణ పనుల కారణంగా రద్దు చేసిందట.
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు రైల్వే ఈ మేరకు సమాధానం ఇచ్చింది. ఎండాకాలంలో విద్యుత్తు కష్టాలను అంచనా వేయలేక ముందుగానే బొగ్గును తరలించే ఆలోచన కూడా చేయలేదు మోదీ సర్కారు. విద్యుత్తు ఇబ్బందులు తలెత్తే సరికి అప్పటికప్పుడు నిద్ర మేల్కొని బొగ్గును సరఫరా చేసేందుకు ప్రయాణికుల రైళ్లను రద్దు చేసింది. దీంతో సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.