దేశ రాజధాని హస్తినలో తీవ్ర నీటి ఎద్దడి
గుక్కెడు నీళ్లకోసం అల్లాడుతున్న ఢిల్లీ వాసులు
ట్యాంకుల ముందు బారులుతీరుతున్న జనం
నీళ్లెత్తుకుపోతారని క్యాన్లకు తాళాలు వేస్తున్న వైనం
యమునా నదిలో అడుగంటిపోయిన నీటి నిల్వలు
ముందస్తు చర్యలు తీసుకోని కేంద్రం, ఢిల్లీ సర్కారు
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే సమయంలో.. భారత్కు మణిమకుటం లాంటి దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఇది! సాంకేతికంగా ఢిల్లీ నీటి సరఫరా బాధ్యత అక్కడి జలమండలిదే కావచ్చు.. కానీ.. అది దేశానికి రాజధాని. భారత్ను పరిపాలించే హక్కు తమకు మాత్రమే ఉన్నదని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీని 20 ఏండ్లు పాలించాయి. ఇవాళ అక్కడ తాగడానికి నీళ్లు లేవు. పరిస్థితి ఏంటంటే.. ‘నీళ్లు లేవు.. మీకు కావాల్సినన్ని నీళ్లు దాచుకోండి’ అని అక్కడి ప్రభుత్వం సలహాలు ఇస్తున్నది. దీంతో దొరికినన్ని నీళ్లు నింపుకొని, వాటిని ఎవరైనా ఎత్తుకెళ్లిపోతారేమోనని క్యాన్లకు, ట్యాంకులకు తాళాలు వేసుకుంటున్న పరిస్థితి!
ఏడేండ్లుగా అధికారంలో ఉన్న ఆప్.. మాది ఢిల్లీ మాడల్ అంటూ దేశమంతా ఊదరగొడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో మారుమూల ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం ఐదు దోనాల తండాకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించి.. గిరిజనుల దప్పిక తీర్చుతున్నది. ఒక్క కుటుంబమే ఉన్నప్పటికీ.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని బబ్లుతండాలో వాటర్ట్యాంకు కట్టి మరీ నీళ్లిస్తున్నది. వందేండ్ల వరకు హైదరాబాద్ నీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా భారీ రిజర్వాయర్ను నిర్మిస్తున్నది. ఐదేండ్లు వానల్లేకపోయినా.. ఢోకా లేకుండా నీటి భరోసాను ఇస్తున్నది. ఎవరు పాలనాదక్షులు? ఎవరిది దేశంపై ప్రేమ? ఎవరిది దూర దృష్టి? ఎవరిది సమర్థత?
న్యూఢిల్లీ, మే 17: ఢిల్లీ. దేశ రాజధాని. ఢిల్లీని రాజధానిగా ప్రకటించినప్పుడు అక్కడి జనాభా రెండున్నర లక్షలు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఏడు లక్షలు. ఇప్పుడు 2.3 కోట్లు. రాజధాని అంటే ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారని తెలుసు. కంపెనీలు వస్తాయని తెలుసు. నీటి అవసరాలు పెరుగుతాయని తెలుసు. కానీ, కేంద్రం లోనూ, ఢిల్లీలోనూ దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ ప్రజలకు నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచించనే లేదు. తాగునీటి అవసరాల కోసం కనీసం ఒక్కటంటే ఒక్క పెద్ద రిజర్వాయర్ కూడా నిర్మించలేదు. ఫలితం.. ఎండాకాలం వస్తే చాలు ఢిల్లీ దూపతో అల్లాడుతున్నది. గుక్కెడు నీళ్లకోసం తండ్లాడుతున్నది. నీళ్లివ్వండి.. నీళ్లివ్వండి అని పక్క రాష్ర్టాలను వేడుకొంటున్నది. మంగళవారం నుంచి మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని, ప్రజలు నీటిని వృథా చేయకుండా నిల్వ చేసుకోవాలని ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) సోమవారం ప్రజలను హెచ్చరించింది. ఈ ప్రకటన ఢిల్లీలో పరిస్థితికి అద్దం పడుతున్నది. డీజేబీ ప్రకటనతో ప్రజలు నల్లా వచ్చినప్పుడు నీళ్లను డ్రమ్ములు, పెద్ద పెద్ద క్యాన్లలో నింపి పెట్టుకొంటున్నారు. నీళ్లు నింపిన క్యాన్లను ఎవరైనా ఎత్తుకుపోతారేమోనన్న భయంతో వాటిని చైన్లతో కట్టేస్తున్నారు.
జనాభాతో పాటు సమస్యా పెరిగింది
ఢిల్లీకి అసెంబ్లీ ఉన్నప్పటికీ అది కేంద్రపాలిత ప్రాంతం. మున్సిపాలిటీలు సహా అనేక అంశాలపై స్థానిక ప్రభుత్వం కంటే కేంద్రానికే అధికారాలు ఎక్కువ. కానీ, అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ ఢిల్లీలో నీటి కొరతపై దృష్టి పెట్టలేదు. ఇబ్బందులు ఎదురైనప్పుడు స్థానిక ప్రభుత్వం మీద నిందలు వేయడం, లేకపోతే తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకొన్నాయి. కానీ క్రమంగా జనాభాతో పాటు సమస్య పెద్దదవుతూ వచ్చింది. ఢిల్లీ చుట్టుపక్కల ఫరిదాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్, నోయిడా బాగా అభివృద్ధి చెందాయి. ఈ నగరాల్లో జనాభా పెరిగింది. ఇక్కడి నుంచి లక్షలాది మంది ఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది కూడా ఢిల్లీలో నీటి కొరతకు కారణం అవుతున్నది.
ఢిల్లీలోని సంజయ్ క్యాంప్లో మంగళవారం వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు పట్టుకుంటున్న స్ధానికులు (దేశమంటే మతం కాదోయ్.. దేశమంటే మనుషులోయ్)
సమస్య వచ్చినప్పుడల్లా కేంద్రం సైలెన్స్
ఢిల్లీ తాగునీటికి హర్యానాలో పారే యమునా నదే ప్రధాన ఆధారం. ఢిల్లీ వినియోగించే నీళ్లలో దాదాపు 90% యమునా నుంచే వస్తాయి. మరో 10% నీటి అవసరాలకు భూగర్భ జలంపై ఆధారపడతారు. అయితే, కొన్నేండ్లుగా ప్రతి ఎండాకాలం యమునా నదిలో నీటి మట్టం తగ్గడం, హర్యానా ప్రభుత్వం నీళ్లను విడుదల చేయకపోవడం, ఢిల్లీ ప్రభుత్వం బతిమలాడటం, సమస్యను తీర్చాల్సిన కేంద్రం ఏమీ పట్టనట్టు ఉండిపోవడం కామన్ అయింది. ఈ ఏడు తీవ్రమైన వడగాలులు, భారీ ఉష్ణోగ్రతల కారణంగా యమునా నది అడుగంటింది. నీటి మట్టం కనీసం కంటే తగ్గిపోయింది. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా ఆగిపోయింది.