కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నారు. లోక్మత్ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన పాత్రికేయుల అవార్డుల ప్రదానోత్సవంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. వరుస ఎన్నికల పరాభవాలతో కాంగ్రెస్ ఢీలా పడిందని, ఆ పార్టీలోని నేతలెవ్వరూ పక్క పార్టీల వైపు తొంగి చూడొద్దన్నారు. కాంగ్రెస్ బలహీనపడితే… ఆ ఖాళీని ప్రాంతీయ పార్టీలు పూరించాలని చూస్తున్నాయని, ఇది మంచి పరిణామం కాదని పేర్కొన్నారు.
అధికారపక్షం, ప్రతిపక్షం… ఈ రెండు చక్రాలపై ప్రజాస్వామ్యం నడుస్తుందని, ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ భావజాలాన్ని పాటించే వారు శ్రద్ధగా అదే భావజాలాన్ని పాటించాలని, వారి వారి నిబద్ధత అలాగే ఉంచుకోవాలని ఆయన సూచించారు. వరుస ఓటముల వల్ల ఎలాంటి నిరాశకు లోనుకాకుండా.. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు పనిచేయాలని కోరారు. ఇప్పుడు ఓటములు వెంటాడుతున్నా… ఎప్పుడో అప్పుడు విజయం కూడా వరిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ ఓడిపోయినా… అప్పటి ప్రధాని నెహ్రూ మాత్రం వాజ్పాయ్కి బాగా విలువనిచ్చేవారని, అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకమన్నారు .