న్యూఢిల్లీ/ఈటానగర్, మార్చి 20: ఏడు దశల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తొలి దశ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ర్టాలు/యూటీల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27వరకు గడువు ఉంటుంది. మార్చి 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 30లోగా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అయితే పండుగ దృష్ట్యా బీహార్కు సంబంధించి ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అక్కడ నాలుగు స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 28గా ఉన్నది. 30న నామినేషన్లను పరిశీలించనున్నారు.
తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఈ తొలి విడతలోనే ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలో ఐదు స్థానాల చొప్పున, బీహార్లో 4, పశ్చిమబెంగాల్లో 3, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.
అరుణాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఏప్రిల్ 19న రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటుగా రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొన్నది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో గెలిచింది. జేడీయూ ఏడు ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకోగా.. కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాగా, అరుణాచల్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుతం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పోటీచేస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ర్టాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేటు ప్రాపర్టీల నుంచి అన్ని రకాల అనధికార రాజకీయ ప్రకటనలను(కటౌట్లు, హోర్డింగ్లు, గోడలపై రాతలు, పోస్టర్లు) వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం 5 గంటలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ర్టాలు, యూటీల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. షెడ్యూల్ ప్రకటనతో ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పనటికీ, పలుచోట్ల రాజకీయ ప్రకటనలను తొలగించలేదని తమకు ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్నది. తమ ఆదేశాలను పాటించకున్నా, పాక్షికంగా అమలు చేసినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.