గుండాల, జూలై 23: కరెంటు సమస్యలపై యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల రైతులు కన్నెర్ర చేశారు. 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సు ద్దాలలోని సబ్స్టేషన్ ఎదుట ఆలేరు-మోత్కూర్ రహదారిపై సుద్దాల, అనంతారం గ్రామాల రైతులు బైఠాయించారు. అనంతరం సబ్స్టేషన్ను ముట్టడించారు. నాటు వేసే సమయంలో కేవలం 12 గంటల కరెంటు ఇవ్వడం వల్ల పొలాలు పారకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నాటు వేసిన వరి ఎండిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 18 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 12 గం టలే కరెంటు ఇస్తున్నారని మండిపడ్డారు. అన్నంపెట్టే రైతులకు రేవంత్రెడ్డి సున్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, కరెంటు ఇవ్వకుండా, పండించిన ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా రైతులను నా నా ఇబ్బందులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. రైతులు రోడ్డుపై భైఠాయించి ధర్నా చేసిన అనంతరం సబ్ స్టేషన్ను ముట్టడించారు. మోత్కూర్ ఏడీ బాలు నాయక్, ఏఈ అంబాల నర్సింహులు గౌడ్, మోటకొండూర్ ఎస్సై అశోక్, గుండాల ఏఎస్సై ప్రకాశ్ వచ్చి రైతులకు సర్దిచెప్పారు. ఆందోళనలో సుద్దాల సర్పంచ్ గడ్డమీది మహోదయ్, అనంతారం సర్పంచ్ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.