న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానోంకు బచావో అంటూ వెల్లో నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా ఓ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడారు. గడిచిన 60 రోజుల నుంచి తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం సేకరించడంలేదన్నారు. అందుకే మేం సభలో ఇలా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, అప్పుడే తాము చర్చలకు సిద్దమన్నారు.
తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం ప్రొక్యూర్ చేయడం లేదని నామా అన్నారు. కేంద్రం ఢిల్లీలో ఒక విషయాన్ని చెబుతోందని, తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతున్నట్లు నామా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, అప్పుడు తాము ఆందోళన విరమిస్తామని ఎంపీ నామా తెలిపారు. టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో స్పీకర్ బిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.