Jamili Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్సభకు, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. అయితే, ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కార్యరూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు) సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడింగ్స్ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగినా.. ఆ తర్వాత
వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
ప్రక్రియ చాలా పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ర్టాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదాపు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలకు సూచించింది.
ఆమోదం లభించడం సులభమేమీ కాదు
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67 శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఆర్టికల్/నిబంధన ఏం చెబుతున్నది?
దేశంలో జమిలి ఎన్నికలు సాగాయిలా..
ఉభయ సభల్లో ఎన్డీయే బలాబలాలు