న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ మద్యం విధానం కేసులో నిరవధికంగా జైల్లో ఉంచలేరని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ, ఈడీలకు తెలిపింది. సిసోడియాపై మోపిన నేరాభియోగాలపై వాదనలు ఎప్పుడు ప్రారంభిస్తారని దర్యాప్తు సంస్థల తరపున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ధర్మాసనం అడిగింది. ‘మీరు ఆయన్ను ఇలా నిరవధికంగా జైల్లో ఉంచలేరు. ఒకసారి చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత వాటిపై వాదనలు వెంటనే ప్రారంభం కావాలి’ అని కోర్టు తెలిపింది.
సిసోడియాపై నమోదైన కేసు సీఆర్పీసీ సెక్షన్ 207(నిందితుడికి దస్ర్తాల సరఫరా) స్థాయిలో ఉందని.. దాని తర్వాత వాదనలు ప్రారంభిస్తామని రాజు తెలిపారు. మంగళవారంలోగా వాదనలు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని జస్టిస్ ఖన్నా రాజును కోరారు. సెక్షన్ 17ఎ ప్రకారం సిసోడియా విచారణ లేక దర్యాప్తునకు ముందస్తు అనుమతి తీసుకొన్నారా అని కోర్టు రాజును ప్రశ్నించింది. మంగళవారం విచారణ కొనసాగిస్తామని తెలిపింది.