న్యూఢిల్లీ, జూన్ 5 : క్యాన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీలో ముఖ్యంగా వాడే రెండు ప్రధాన ఔషధాలకు దేశ వ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్సలో వినియోగించే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాలు మార్కెట్లో లభ్యం కావడం లేదని, వీటికి తీవ్ర కొరత ఉందని క్యాన్సర్ రోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార, అండాశయ, తల, మెడ క్యాన్సర్ చికిత్సలో ఈ రెండు మందులను విస్తృతంగా వాడుతుంటారు. అయితే దేశ వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఈ రెండు మందుల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో రోగులకు వైద్యం అందించడంలో ఆలస్యమవుతున్నదని, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను అవలంబించాల్సి వస్తున్నదని డాక్టర్లు తెలిపారు. మందుల కొరత కారణంగా దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
గత నాలుగు నెలలుగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఈ ఔషధాలలో వాడే కీలక పదార్థం ప్లాటినం ధరలు అధికంగా పెరిగాయని, అందుకే వీటికి కొరత ఏర్పడిందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా వైద్య చికిత్స అందించాల్సిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎయిమ్స్, ఢిల్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎండీ రే తెలిపారు. ‘ప్రస్తుతం ఔషధ నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉన్న సరుకు ఒకటి రెండు రోజులకే సరిపోతుంది. ఆ తర్వాత పరిస్థితి విపత్కరమవుతుంది’ అని సర్ గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ శ్యామ్ గార్గ్ పేర్కొన్నారు. ముడి సరుకు ధరలు పెరిగినందున క్యాన్సర్ మందుల ధరలను పెంచాలంటూ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పెంచకపోడంతో.. నష్టాలకు వాటి తయారీని తగ్గించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.