One Nation One Election | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, చైనా, అన్నింటికన్నా మిన్నగా అదానీ..! వీటితో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ సర్కారు దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమిలి ఎన్నికల పాచిక వేసిందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది. జమిలి ఎన్నికలకు మార్గం సుగమం చేసే కీలక నిర్ణయం ఈ సమావేశాల్లోనే అమల్లోకి రావొచ్చునన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఒకవేళ మోదీసర్కారు జమిలి ఎన్నికలకు సిద్ధపడితే.. సార్వత్రిక ఎన్నికలతోపాటే రాష్ర్టాల శాసనసభ ఎన్నికలనూ నిర్వహించాల్సి ఉంటుంది. అదే జరిగితే, మొన్ననే ఎన్నికలు జరిగిన కర్ణాటకలో ఏం చేస్తారు? తెలంగాణలో ఎన్నికలను ఏప్రిల్కు మారుస్తారా? లేక కేంద్రమే ముందస్తుగా డిసెంబర్లో ఎన్నికలకు వచ్చేస్తుందా? ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు ఆగమేఘాలపై సాధ్యమేనా? మోదీ సర్కారు ఇప్పుడే జమిలిని తెరమీదికి ఎందుకు తీసుకొస్తున్నది? వారు ప్రవచిస్తున్న ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమేనా? జవాబులేని ప్రశ్నలెన్నో.. జనం కోరుతున్న స్పష్టత ఎంతో!
ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటనతో బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు (వన్ నేషన్-వన్ ఎలక్షన్)’తో ఒకేసారి లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికల అంశంపై నిపుణులతోపాటు రాజకీయ పార్టీల నేతలతో కమిటీ సమావేశం కానున్నదని, వారి అభిప్రాయాలు తీసుకొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కమిటీ సభ్యుల పేర్లను త్వరలో ఓ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్న తర్వాతి రోజునే జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే పార్లమెంట్ సమావేశాల అజెండాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇంత అత్యవసరంగా సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం, అందుకు కారణంగానీ, సమావేశాల ఎజెండాగానీ వెల్లడించకపోవటంతో ఊహాగానాలు మొదలయ్యాయి. లోక్సభను రద్దుచేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతున్నది.
జమిలికి గతంలో కోవింద్ మద్దతు
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. 2017లో రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ కూడా మోదీ అభిప్రాయానికి మద్దతు పలికారు. 2018లో పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడుతూ వరుసగా ఎన్నికల జరుగుతుండటం వలన ఆర్థికంగా భారం అవడంతో పాటు మానవ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని, ఇదే సమయంలో వరుస ఎన్నికలతో అమల్లోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియామావళి వలన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ జరుగాలని, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని అన్నారు.
జమిలితో లాభాలేంటి? నష్టాలేంటి? ప్రయోజనాలు
ప్రతికూలతలు