కోల్కతా, ఆగస్టు 13: కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని సాయంత్రంలోగా, ఇతర డాక్యుమెంట్లను బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
విధుల బహిష్కరణను విరమించుకోవాలని రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న వైద్యులను చీఫ్ జస్టిస్ శివజ్ఞానం నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కోరింది. కాగా, కేంద్రమంత్రి నడ్డా తమ డిమాండ్లకు అంగీకరించడంతో నిరసనలను విరమిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది.
పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు బాధితురాలిపై క్రూరమైన దాడికి పాల్పడ్డాడని, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలైనట్టు తేలింది. అదేవిధంగా తనపై లైంగిక దాడిని బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పెనుగులాట చోటుచేసుకొన్నట్టు పోస్టుమార్టం నివేదిక చెబుతున్నది. ముఖంపై రక్తపు గాయాలున్నాయని, కండ్లలో నుంచి రక్తసావ్రం అయిందని, బాధితురాలి జననాంగాల్లో తీవ్రమైన గాయం అయినట్టు తేలింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో బాధితురాలు మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఇటీవల వైద్యులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకు ప్రత్యేకంగా పాలసీని రూపొందించాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) సూచించింది. ఈ మేరకు అన్ని మెడికల్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఓపీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టళ్లు, క్యాంపస్లోని ఇతర ప్రదేశాలు, రెసిడెన్షియల్ క్వార్టర్లలో రక్షణ చర్యలు చేపట్టాలని కోరింది. ఎవరైనా వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనలపై 48 గంటల్లోగా నివేదికను ఎన్ఎంసీకి పంపాలని సూచించింది.