న్యూఢిల్లీ, నవంబర్ 30: పౌరసత్వ మంజూరు విషయంలో మతాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 మన దేశ లౌకిక సూత్రాన్ని నాశనం చేస్తున్నదని తమిళనాడు పాలకపక్షం డీఎంకే పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం సీఏఏ పరిధి నుంచి తమిళ శరణార్థులను మినహాయించడం వివక్షాపూరితమైనదని, ఈ చట్టం తమిళ జాతికి వ్యతిరేకమని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు తాజాగా అఫిడవిట్ సమర్పించింది. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని, చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను సీఏఏ ఉల్లంఘిస్తున్నదని, పూర్తిగా ఏకపక్షమైనదని పేర్కొన్నది. పౌరసత్వ సవరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తమిళ శరణార్థుల విషయంలో ఏమీ చెప్పలేదని ఆక్షేపించింది. గతంలో పీడన కారణంగా భారత సంతతి తమిళులు పొరుగు దేశమైన శ్రీలంకకు వెళ్లారని, ప్రస్తుతం మనదేశంలో శరణార్థులుగా జీవిస్తున్నారని, వీరిని చట్ట పరిధిలోకి తీసుకోలేదని డీఎంకే తన పిటిషన్లో పేర్కొన్నది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు మాత్రమే సీఏఏ పరిమితమైందని.. అది కూడా ఆయా దేశాల నుంచి భారత్లోకి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతాలకు చెందిన వారినే అనుమతిస్తుందని తెలిపింది.