ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక దర్శి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. బస్సు పొదిలి (Podili) నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.
వివాహ రిసెప్షన్ (Wedding Reception) కోసం కాకినాడ (Kakinada) వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ గరుడ బస్సును అద్దెకు తీసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పొదిలి నుంచి బయలుదేరిన బస్సు.. దర్శి వద్ద ఎదురుగా లారీని తప్పించడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పి సాగర్ కాల్వలో పడిపోయిందని తెలిపారు. మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హాని (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.