లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని యూపీ ప్రభుత్వానికి తాజాగా బుల్డోజర్ ఒక లోగోలా మారింది. మినియేచర్ బుల్డోజర్లను ఇప్పుడు బహుమతులుగా ఇస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని కత్రా ఫంక్షన్ హాల్లో చౌరాసియా కమ్యూనిటీ నిర్వహించిన సామూహిక వివాహాల్లో ఆదివారం తొమ్మిది జంటలు ఏకమవగా వారికి బుల్డోజర్ టాయ్తో పాటు ఇతర బహుమతులు అందచేశారు.
ప్రయాగ్రాజ్ మేయర్ అభిలాష్ గుప్తా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బుల్డోజర్ మహిళల భద్రతతో పాటు యూపీ అభివృద్ధికి చిహ్నంగా మారిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పినందుకు బుల్డోజర్ బాబాగా పేరొందిన యోగి ఆదిత్యానాధ్కు వధువులు ధన్యవాదాలు తెలిపారు.
యోగి తొలి విడత పాలనలో మాఫియా, నేరస్తుల ఆస్తులను కూలగొట్టేందుకు బుల్డోజర్ను విస్తృతంగా ఉపయోగించడంతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ బుల్డోజర్ల ప్రస్తావన తీసుకొస్తూ ర్యాలీల్లో హోరెత్తించారు. విపక్షాలు సైతం ఆయనను బుల్డోజర్ బాబా అంటూ ఎద్దేవా చేయగా కాషాయ పార్టీ శ్రేణులు ప్రచార ర్యాలీల్లోనూ బుల్డోజర్లకు చోటు కల్పించారు.