న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ భవన్ నుంచి విజయ్ చౌక్ వరకూ తిరంగా మార్చ్ను నిర్వహించారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న తమ డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అధికార బీజేపీ సభ్యులు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరుగకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తిరంగా మార్చ్ అనంతరం బీఆర్ఎస్ సహా 19 విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులు కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువల గురించి కేంద్రం అనేక మాటలు చెప్తుందే తప్ప, వాటిని పాటించదని విమర్శించారు. సమావేశాలను సాఫీగా నడవకుండా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, దేశం నియంతృత్వం దిశగా వెళ్లడం ఖాయమన్నారు. రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం 12 నిమిషాల్లోనే ఆమోదం తెలిపిందని కేంద్రంపై మండిపడ్డారు. పైగా ప్రతిపక్ష సభ్యులు సహకరించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నదన్నారు. చర్చ జరుగకుండా అడ్డుపడుతున్నదని బీజేపీనేనని, తాము ఏదైనా డిమాండ్ చేసినా లేదా నోటీసు ఇచ్చినా.. మాట్లాడేందుకు అవకాశమే ఇవ్వలేదని ఆరోపించారు. 52 ఏండ్ల ప్రజా జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. అదానీ ఆస్తులు కేవలం రెండేండ్లలోనే రూ.12 లక్షల కోట్లకు ఎలా చేరాయని ఆయన ప్రశ్నించారు. అదానీ అంశంపై జేపీసీ వేసేందుకు కేంద్రం ఎందుకు భయపడుతున్నదని నిలదీశారు. దీని వెనుక ఏదో మతలబు ఉన్నదని, అందుకే జేపీసీ వేయట్లేదని ఆరోపించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో సమాధానం చెప్పకుండా.. బ్రిటన్లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ప్రజల దృష్టిని కేంద్రం మళ్లించిందన్నారు. రాహుల్గాంధీపై మెరుపువేగంతో అనర్హత వేటు వేశారని, అమ్రేలీ బీజేపీ ఎంపీకి మూడేండ్లు జైలు శిక్ష పడినా, 16 రోజులైనా అనర్హత వేటు వేయలేదని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న విపక్ష పార్టీల మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ తామంతా ఒకేతాటిపైకి వచ్చామన్నారు. ‘మమ్మల్ని విడదీసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మేం ఒక్కటిగానే ఉన్నాం. ఎలా ఐక్యంగా ముందుకు సాగాలన్నదానిపై పనిచేస్తున్నాం. నాయకత్వం అంశాన్ని ఎందుకు మీరు పదేపదే అడుగుతారు. దేశాన్ని కచ్చితంగా ఒక వ్యక్తి నడిపిస్తారు. భిన్న సిద్ధాంతాలు నడిపిస్తాయి. మేం కలిసి ఉండేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఎలా వృథా అయ్యాయో చూస్తున్నామన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్కు ఆమోదం తెలిపారని విమర్శించారు. అధికార పార్టీ సభ్యులే ఆందోళనకు దిగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నానన్నారు. అబ్కీబార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని తాము తీసుకున్నామని, అన్నదాతలకు న్యాయం చేయాల్సి ఉన్నదని, ఇదే అంశాన్ని ఇతర పార్టీలకు చెబుతున్నామన్నారు. తెలంగాణను ఒక మాడల్గా చూపించాలనుకుంటున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. వాయిదాలతోనే సమావేశాలను సరిపెట్టిందని అన్నారు. తప్పు చేసింది కనుకనే అదానీ అంశంపై జేపీసీ వేయకుండా పారిపోయిందన్నారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు.