ఓ బొమ్మ తయారీకి ఏడు రూపాయలు ఖర్చైంది. రవాణా ఇతరత్రా వ్యయం రూ. 3 కలుపుకొని గరిష్ట ధరను రూ.10గా నిర్ణయించారు. అయితే, అంతర్జాతీయంగా ముడిసరుకు ధరలు తగ్గడంతో తయారీ ఖర్చు రూ.5కు దిగొచ్చింది. అంటే బొమ్మ గరిష్ట ధర రూ.8గా ఉండాలి. అయితే ప్రభుత్వం.. రూ. 10నే వసూలు చేస్తున్నది. ఇది తప్పా.. ఒప్పా?
అన్నదాతల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదే చేస్తున్నది. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనాలు రైతులకు అందకుండా.. ఒకవైపు ఎరువుల సబ్సిడీకి కోత విధిస్తూనే.. మరోవైపు ఎరువుల ధరలను ఎంతమాత్రం తగ్గించడం లేదు. సేంద్రియ సాగుకు ఉద్దేశించిన ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీని ఏటికేడూ క్రమంగా ఎత్తేస్తూ ఎరువుల కొరతను సృష్టించేందుకు కుట్రకు తెరతీస్తున్నది.
Fertiliser subsidy | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఎరువుల ధరలు, సబ్సిడీపై కేంద్రం బుధవారం ప్రకటన చేసింది. ఈసారి ఎరువుల ధరలు పెంచడం లేదని, వానాకాలానికి గానూ రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి మాండవీయా వెల్లడించారు. యూరియాకు రూ.70 వేల కోట్లు, డీఏపీకి రూ.38 వేల కోట్లు రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అయితే యూరియా, డీఏపీ వంటి ఎరువులకు గతంలో ఇస్తున్న సబ్సిడీ కేటాయింపులతో పోలిస్తే, ఈసారి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గడంతోనే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినట్టు కేంద్రం చెప్పుకొచ్చింది. ధరలు తగ్గాయన్న కారణంతో సబ్సిడీలో కోత పెట్టిన కేంద్రం.. అంతర్జాతీయ ధరల క్షీణతకు అనుగుణంగా దేశీయంగా ఎరువుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొందా అంటే? అదీ లేదు. గ్లోబల్ మార్కెట్లలో తక్కువ ధరకు ఎరువులు లభిస్తున్నప్పటికీ, అన్నదాతలకు ఆ ప్రయోజనం దక్కకుండా కేంద్రం కుట్రకు తెరతీస్తున్నదని అర్థమవుతున్నది.
రైతులపై భారం పడకుండా ప్రభుత్వాలు దశాబ్దాల నుంచి ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. అయితే బీజేపీ సర్కారు ఆ విషయాన్ని గాలికొదిలేసి సబ్సిడీ భారాన్ని వదిలించుకోవటంలో భాగంగా సేంద్రియ సాగును ప్రోత్సహించే ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీకి కేంద్రం 22.25 శాతం కోత పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ రూ.2.54 లక్షల కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.1.75 లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలిపారు. రాష్ర్టాలకు కేటాయించిన కోటాలో మూడింట ఒక వంతు మాత్రమే ఎరువులు సరఫరా అవుతున్నాయని బెంగాల్ సీఎం మమత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ఎరువులు దొరక్కపోవడంతో మధ్యప్రదేశ్, యూపీ తదితర రాష్ర్టాల్లో లైన్లలోనే నిలబడి రైతన్నలు ప్రాణాలు విడిచిపెడుతుండటం ఎరువుల ‘కృత్రిమ’ కొరతకు తార్కాణాలు. ‘ప్రణామ్’ స్కీమ్ను ప్రోత్సహించడానికే కేంద్రం ఈ విధంగా చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అమ్మోనియా, ఫాస్ఫరిక్ యాసిడ్తో పాటు ఎంవోపీ, డీఏపీ, 10:26:26, 28:28:0, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ధరలు తగ్గుతున్నాయి. యూరియా తయారీలో ప్రధానమైన అమ్మోనియా ధరల్లో జనవరి-ఫిబ్రవరిలో 12 శాతం తగ్గుదల, మార్చికి 39 శాతం క్షీణించాయి. ఏప్రిల్లోనూ ఈ సరళి కొనసాగింది. ఫలితంగా యూరియాతో పాటు ఇతర ఎరువుల ధరలు భారీగా దిగివచ్చాయి. దీంతో ఎరువులపై ఇప్పటికే ప్రకటించిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం తగ్గించింది. రేట్లను మాత్రం సవరించలేదు. రైతులకు చేరాల్సిన ఆర్థిక ప్రయోజనం కేంద్ర ఖజానాకు మళ్లుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.