BRS Party | న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంను బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం కలిసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లు ఎంపీలు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో కూడా ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల పలు గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించిన గుర్తుల్లో.. కారు గుర్తును పోలిన విధంగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘంను కలిసిన వారిలో ఎంపీలు వెంకటేష్ నేత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఉన్నారు.