Maharashtra BRS | ముంబై, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ తొలుత స్థానిక సంస్థల ఎన్నికలతోనే విజయయాత్ర ప్రారంభించింది. పార్టీగా ఆవిర్భవించిన అనతికాలంలోనే సంచలన విజయాలను నమోదుచేసిన బీఆర్ఎస్.. అలుపెరగని పోరాటాలతో స్వరాష్ట్రం సాధించింది. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టి, మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నది. తెలంగాణలో మాదిరిగానే ఇప్పుడు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోనూ ‘గులాబీ’ తుఫాన్ మొదలైంది. బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగుపెట్టిన కొన్ని నెలలకే జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికల్లో సత్తా చాటింది.
130 సర్పంచ్ పదవులకు ఉప ఎన్నికలు జరుగగా.. ఇందులో ఏకంగా 57 పదవులు కైవసం చేసుకున్నది. అంటే 44% స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది. మొత్తంగా 327 వార్డుల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. సీఎం కేసీఆర్ దేశం ముందు ఉంచిన సంక్షేమ ఎజెండాకు ప్రజాదరణ విపరీతంగా పెరుగుతున్నదని నిరూపితమైంది. ఈ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ శకం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని 2,359 గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న 130 సర్పంచ్ పదవులకు ఆదివారం ఉప ఎన్నికలు నిర్వహించారు. సోమవారం ఓట్ల లెకింపు చేపట్టారు.