న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు పాల్పడటం పట్ల సీపీఎం నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ (Brinda Karat) ఆందోళన వ్యక్తం చేశారు. దూషణల పర్వంలో తాము ఒకరికొకరం తీసిపోమనే రీతిలో ఇరు పార్టీలు దిగజారాయని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మనం ఇతర పార్టీలను ఏ స్ధాయిలో తిట్టామనేదే కీలకమనే రీతిలో బీజేపీ, కాంగ్రెస్లు రాజకీయాలను దిగజార్చాయని బృందా కారత్ మండిపడ్డారు.
ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా వాస్తవిక అంశాల నుంచి దృష్టి మరలిస్తూ ఈ రెండు పార్టీలు ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు. వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరుగుపరిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు దూషణలకు తెగబడుతున్నాయని అన్నారు. ఈ పార్టీల తీరు సరైంది కాదని, దేశంలో అగ్రనేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం తగదని చెప్పారు. ఇవి ఏ తరహా రాజకీయాలని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు, క్షేత్రస్ధాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ సిద్ధంగా లేవని వాపోయారు. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని హాజరవడంతోనే భారత్ జట్టు ఓటమి పాలైందని కాంగ్రెస్ ఆరోపించగా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున మ్యాచ్ జరగడంతోనే భారత్ ఓడిపోయిందని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Read More :