Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జి పేకముక్కలా కూలిపోయింది. ఈ ఘటన కిన్నౌర్ జిల్లాలోని, ఉర్ని ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిడ్జిపై నుంచి ఎప్పట్లాగే వాహనాలు వెళ్తున్నాయి. ముందుగా ఒక ట్రక్కు వెళ్లింది. అది అవతలివైపు చేరిన తర్వాత మరో ట్రక్కు బ్రిడ్జిపైనుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. అలా ఒకవైపు నుంచి ట్రక్కు మరోవైపు చేరుకునేలోపే ఆ బ్రిడ్జి పేకముక్కలా కూలిపోయింది.
ట్రక్కు కూడా బ్రిడ్జితోపాటే లోయలో పడిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఆ ట్రక్కు డ్రైవర్కు ప్రాణహాని జరగలేదు. స్వల్ప గాయాలతోనే బయపడ్డాడు. ఈ ఘటనలో ఇతరులు ఎవరూ కూడా గాయపడలేదు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధిత డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన పేలుడు శబ్దంతో బ్రిడ్జి కూలిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో తాము తీవ్రంగా ఆందోళన చెందామన్నారు. బ్రిడ్జి కూలడంతో అధికారులు స్పందించారు. 24 గంటలపాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ఈ బ్రిడ్జి కాజా, షిమ్లా జిల్లాలను కలుపుతుంది. ఇక్కడి లాహౌల్ స్పితిని, కిన్నౌర్ ప్రాంతాలకు ఈ బ్రిడ్జిమీదుగానే వెళ్లాలి.
ఈ బ్రిడ్జి కూలడంతో దాదాపు మూడు జిల్లాలను కలిపే మార్గం లేకుండాపోయిందని అధికారులు తెలిపారు. అయితే, వాహనం అధిక లోడింగ్ కారణంగానే ఈ బ్రిడ్జి కూలిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఓవర్ లోడ్ వాహనాలు వెళ్లకూడదనే సూచన అక్కడ ఉందని అధికారులు అంటున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.