ముంబై/బెంగళూరు, డిసెంబర్ 28: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ముదిరిపాకాన పడింది. మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. రెండు రాష్ర్టాల బీజేపీ సర్కార్లు కత్తులు దూస్తున్నాయి. బెళగావి మహారాష్ట్రకు దక్కాలని మహారాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఫైర్ అయ్యారు. ఒక్క అంగుళం కూడా వదులుకునేది లేదని స్పష్టంచేశారు. మరోవైపు కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి ఈ వివాదంలోకి ముంబైని లాగారు. మరాఠీలు ఎక్కుగా ఉన్నారు కనుక బెళగావిని కనీసం కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్పై కర్ణాటక మంత్రి అశ్వత్థనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సబబైతే ముంబైని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని వివాదాన్ని కొత్తమలుపు తిప్పారు.
ముంబైలో 20 శాతం మంది కన్నడిగులు ఉన్నారని, కనుక ఆ మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మహారాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. ముంబై ‘ఎవడబ్బ సొమ్ము కాదు’ అని మండిపడ్డారు. అది పూర్తిగా మహారాష్ట్రకు చెందినదని స్పష్టంచేశారు.
రాష్ట్రం అభిప్రాయాలను కర్ణాటక ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేస్తామని పేర్కొన్నారు. దీనిపై విపక్ష నేత అజిత్ పవార్ (ఎన్సీపీ) స్పందిస్తూ.. కర్ణాటక సీఎం, మంత్రులు మహారాష్ట్ర ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఆ స్థాయిలో లేదని విమర్శించారు. అలాంటి ‘వాగుడుకాయ’లను మందలించాలని కేంద్ర హోంమంత్రిని కోరుతామని తమపార్టీ కర్ణాటక మంత్రులను ఉద్దేశించి ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. బెళగావి, కార్వార్, బీదర్తో సహా కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలున్న 865 గ్రామాలను మహారాష్ట్రలో కలుపాలని ఆ రాష్ట్ర ఉభయసభలు తీర్మానం చేసింది.