IndiGo flight : ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా (పశ్చిమ బెంగాల్) ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. అయితే, ఈ బాంబు బెదిరింపు గతంలోలాగా ఫోన్, మెయిల్, మెసేజ్ ద్వారా కాకుండా.. విమానంలో ఒక నోట్ ద్వారా వచ్చింది.
విమానంలో ఒక టిష్యూ పేపర్ పై గుర్తు తెలియని వ్యక్తి చేతితో ఈ బెదిరింపు పత్రం రాసినట్లు ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు. ఇండిగో విమానం ఉదయం ఢిల్లీ నుంచి బాగ్దోగ్రా వెళ్తుండగా.. విమానంలో బాంబు ఉందని ఆ విమానంలోని టాయిలెట్ లో ఉన్న ఒక టిష్యూ పేపర్ పై చేతి రాతతో రాసి ఉండగా సిబ్బంది గుర్తించారు. దీంతో విమానంలోని పైలట్లు ఏటీసీకి సమాచారం అందించారు. అనంతరం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 9.17 గంటలకు లక్నో విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఈ సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల్ని తనిఖీ చేశారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్తితి అదుపులోనే ఉందని అక్కడి అధికారులు తెలిపారు.