సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థర్డ్వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలి. సంబంధిత నియంత్రిత ప్రణాళికలను సిద్ధం చేయాలి. కరోనా వ్యాప్తి ఎకువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, అలంపూర్, గద్వాల, నారాయణపేట, మక్తల్, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వైద్యశాఖ కార్యదర్శితోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలి. సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని ఏరియా, జిల్లా తదితర దవాఖానల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాల కల్పించాలి.
-రాష్ట్ర క్యాబినెట్ ఆదేశాలు
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరో పది రోజులపాటు పొడిగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకొన్నది. అయితే సడలింపు సమయాన్ని మరో మూడు గంటలపాటు పెంచారు. ఉదయం ఆరు గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి మరో గంటపాటు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయమిస్తారు. ఆ తర్వాత నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం.. పలు నిర్ణయాలను ఆమోదించింది. లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు, రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ స్థాయి వరకు వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు క్యాబినెట్ సమావేశం సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని, వెనుకంజ వేసేది లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, సామాజిక భద్రతాంశాలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకొంటూ వచ్చామని, ఇకపై ప్రభుత్వ అత్యధిక ప్రాథమ్యాంశాలు విద్య, వైద్యం మాత్రమేనన్నారు. కరోనా థర్డ్వేవ్ కూడా వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో.. దాన్ని దీటుగా ఎదుర్కోవడానికి వైద్యారోగ్యశాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో బెడ్లన్నింటినీ ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. అన్ని దవాఖానలు సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకొనే విధంగా ప్లాంట్లను ఏర్పాటుచేయాలని సూచించింది. కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏర్పాటుచేసే దవాఖానల్లో సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఉంటేనే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
ఐదు గంటలపాటు.. సుదీర్ఘంగా
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా అనేక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా వైద్యరంగాన్ని బలోపేతం చేసే అంశంపై విస్తృత ప్రాతిపదికన చర్చించింది. ఇందులో భాగంగానే నాగర్కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలో ఏడు మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరై ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను క్యాబినెట్ మంజూరుచేసింది.
వరంగల్ జైలు ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన
వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్తుతం సెంట్రల్జైలు ఉన్న ప్రాంగణంలో చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. జైలులో ప్రస్తుతం ఉన్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోంశాఖ అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధంచేసి.. తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశం ముందుంచాలని ఆదేశించింది.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా
ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా టీకాలు వేసేందుకు ప్రాధాన్యమివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు విధివిధానాలను ఖరారుచేయాలని వైద్యశాఖను ఆదేశించింది.
కేంద్రం ఇవ్వదు.. కొందామంటే దొరకదు
వ్యాక్సిన్ కేటాయింపులలో తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై మంత్రివర్గ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వం వ్యాక్సినేషన్ పట్ల తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని అభిప్రాయపడింది. 85% వ్యాక్సిన్ను తయారీదారుల నుంచి తీసుకొంటున్న కేంద్రం తెలంగాణ ప్రజలకు సరిపడిన విధంగా ఇవ్వడం లేదని విమర్శించింది. మార్కెట్లో కొనుగోలు చేద్దామంటే దొరకకుండా చేసిందని, ఫలితంగా తెలంగాణ ప్రజలకు త్వరగా వ్యాక్సిన్ ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నది. అయినా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్న విషయంపై మంత్రివర్గం చర్చించింది.
బీసీ రిజర్వేషన్లు మరో పదేండ్ల్లు
రాష్ట్రంలో ఇప్పుడు అమలుచేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పదేండ్లపాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కలిగించేలా ఈ రిజర్వేషన్లను మరో పదేండ్లు పొడిగించారు.
నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు
పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ఆర్)గా నామకరణంచేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అతి తకువ సంఖ్యలో హాజరై జరుపుకోవాలని, ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయపతాకాన్ని ఆవిషరించాలని తీర్మానించింది.
ప్రత్యామ్నాయ పంటల వైపు..
రైతులను చైతన్యపరిచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సీఎం కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు చెప్పారు. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం డిమాండు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో వరిపంట కన్నా భవిష్యత్తులో పత్తికే ఎకువ లాభాలొస్తాయని క్యాబినెట్ అంచనావేసింది. కందులకు కూడా మారెట్లో డిమాండున్న నేపథ్యంలో కందిపంటను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖకు సూచించింది. రైతులు అధికంగా లాభాలు వచ్చే పంటలు వేయాలని పిలుపునిచ్చింది. గతేడాది 61 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారని, ఈ ఏడాది 75 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి వేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, వర్షం లేకపోయినా పత్తి, కంది తదితర పంటలు పండించవచ్చునని అభిప్రాయపడింది. నీళ్లు పారించి పండించడం ద్వారా పత్తి దిగుబడి ఎక్కువగా వస్తుందని పేర్కొన్నది. నీళ్ల ద్వారా పండించే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నదని, ఉత్పత్తి ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు వస్తుందని తెలిపింది. వరి పంట కంటే అధిక లాభాలు వస్తాయని అభిప్రాయపడింది.
పార్ట్ బీ నుంచి ఏ లోకి వచ్చిన భూములకు రైతుబంధు
రైతుబంధు ఆర్థికసాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులకు అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. యాసంగిలో జమచేసిన విధంగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమచేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి వచ్చిన భూములకు రైతుబంధు సాయం అందించాలని, దీనికి జూన్ 10ని కటాఫ్గా నిర్ణయించింది. ఈలోగా ఇందుకు సంబంధించిన భూముల వివరాలను అప్డేట్ చేసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయశాఖలను ఆదేశించింది. భూసారాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నది.
భూములు అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి
కరోనా కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకొనేందుకు చేపట్టవలసిన చర్యల గురించి క్యాబినెట్ ఈ సందర్భంగా చర్చించింది. ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఈ కష్టకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు, ఇండ్లు అమ్మడంకోసం తక్షణమే చర్యలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను రాష్ట్ర క్యాబినెట్ ఆదేశించింది.
వ్యవసాయం స్థిరపడింది.. బలపడింది
‘రాష్ట్రంలో వ్యవసాయం స్థిరపడింది.. బలపడింది.. రైతుకు మరింత ప్రయోజనకారిగా వ్యవసాయాన్ని మార్చాలి’ అని సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో అన్నారు. రుతుపవనాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయంపై క్యాబినెట్ రెండున్నర గంటలకుపైగా చర్చించింది. గతేడాది రెండు పంటలకు కలిపి మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అయిందని సంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటివరకు రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రికార్డు అని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్సీఐకి స్థిరత్వం లేదని విమర్శించారు. ‘ఒకసారి దొడ్డు బియ్యం వద్దంటారు. ఒకసారి బాయిల్డ్ రైస్ కావాలని, మరోసారి సన్నబియ్యం కావాలని, ఇలా రకరకాల ఉత్తర్వులతో తెలంగాణను కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నది’ అని సీఎం అన్నారు. ధాన్యం సేకరణను పూర్తిగా చేపట్టకుండా తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న అనుచిత వైఖరిపై క్యాబినెట్ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున రాష్ట్రంలో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటుచేయాల్సిన అవసరం పెరిగిందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ ఆదేశించింది. 87% ధాన్యం సేకరణ జరగడం పట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. కొనుగోళ్లను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. వరిలో సన్నాలకు మారెట్లో డిమాండు ఉంటుందనే విషయంపై సమావేశం చర్చించింది.
థర్డ్వేవ్ పట్ల అప్రమత్తం
కరోనా థర్డ్వేవ్ వస్తున్నదన్న వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలని, దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను ముందే సిద్ధంచేసుకోవాలని క్యాబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీరు, బాధితులకు అందుతున్న వైద్యం, నియంత్రణ కోసం వైద్యశాఖ అధికారులు తీసుకొంటున్న చర్యలను క్యాబినెట్ సమీక్షించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తున్నదని వైద్యశాఖ అధికారులు క్యాబినెట్కు నివేదించారు. వైరస్ వ్యాప్తి ఎకువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, అలంపూర్, గద్వాల, నారాయణ్పేట, మక్తల్, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వైద్యశాఖ కార్యదర్శితోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించి, సమీక్షలు జరిపి వైరస్ కట్టడికి తగు చర్యలను తీసుకోవాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్రంలో అన్ని ఏరియా, జిల్లా దవాఖానల పరిస్థితుల మీద సమీక్ష చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొన్నది.
నిపుణులతో రైతులకు శిక్షణ
రాష్ట్రంలోని రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుశిక్షణ కార్యక్రమాలను నిరంతరం జరుపాలని క్యాబినెట్
పేర్కొన్నది. రైతువేదికల ద్వారా విత్తడం, యాంత్రీకరణ, ఎరువుల వాడకం, మార్కెట్ పరిస్థితులపై నిపుణులతో అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతుబంధు సమితి సంఘాల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. ఏఈవో క్లస్టర్లలో డీఏవోలు, వ్యవసాయశాఖ అధికారులు రైతు వేదికలను కేంద్రంగా చేసుకొని వ్యవసాయశాఖ విధులను పర్యవేక్షించాలని సూచించారు. వానకాలంలో వరి, కంది, పత్తి, పంటల సాగు గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. వరి నాటే పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతిని అవలంబించాలని రాష్ట్ర రైతాంగానికి క్యాబినెట్ పిలుపునిచ్చింది.
అందుబాటులో విత్తనాలు, ఎరువులు
వానకాలం వ్యవసాయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాల లభ్యత, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. కల్తీ విత్తనాలు ఎరువులు తదితర కల్తీ పురుగుమందులు తయారీదారుల పట్ల కఠినచర్యలు తీసుకోవాలని, వ్యవసాయశాఖ అధికారులను, హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులను నిర్దేశించింది. వ్యవసాయశాఖలో రెండు అదనపు డైరెక్టర్ పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయించింది. ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల కోసం తొమ్మిది నుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, స్థలాలను గుర్తించాలని ఆదేశించింది.
మంత్రి కేటీఆర్ ట్వీట్లు
రాష్ట్ర మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాలను వివరిస్తూ పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుపై స్పందిస్తూ 2014కు ముందు తెలంగాణలో నాలుగు వైద్య కళాశాలలే ఉండేవని, రాష్ట్రం వచ్చాక ఐదు కాలేజీలను ఏర్పాటుచేశామని, ఇప్పుడు మరో ఏడు రాబోతున్నాయన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్, లాక్డౌన్ కొనసాగింపు పైనా మంత్రి కేటీఆర్ ట్వీట్చేశారు. విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు భద్రంగా ప్రయాణం చేయడానికి వీలుగా వ్యాక్సిన్ వేయిస్తామని పేర్కొన్నారు.