Adani Group | పర్యావరణ పరిరక్షణకు పాటుపడతానని నమ్మించాడు. దీంతో కొందరు పెద్ద ఎత్తున డబ్బు కుమ్మరించారు. పలు సంస్థలు రాయితీలు కూడా ప్రకటించాయి. అలా సమకూరిన నిధులను ఆ ఉల్లంఘనుడు దారి మళ్లించాడు. పర్యావరణాన్ని బుగ్గిపాలు చేసే తన కోల్ మైనింగ్ ప్రాజెక్టులో పెట్టుబడులుగా పెట్టాడు. అదానీ గ్రూప్లో జరుగుతున్న అక్రమాలపై ప్రఖ్యాత పత్రిక ‘బ్లూమ్బర్గ్’ తాజా కథనంలో అనేక విషయాలను వెల్లడించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ‘హిండెన్బర్గ్’ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బొగ్గు రంగంలో వేళ్లూనుకొన్న అదానీ గ్రూప్.. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ స్థాపన పేరిట భారీగా నిధులు సేకరించింది. ఆ సొమ్మును కోల్మైనింగ్ కంపెనీలకు పెట్టుబడుల కోసం మళ్లిస్తున్నది. ఈ మేరకు ‘బ్లూమ్బర్గ్’ ఓ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తదితర కంపెనీలకు చౌకగా సమకూరిన కోట్లాది రూపాయలను.. అదానీ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్నకే చెందిన కార్మికెల్ కోల్ మైన్ ప్రాజెక్టుకు పెట్టుబడుల రూపంలో నిధులు చేరాయి. ఈ మేరకు ఫిబ్రవరి 10 నాటి పబ్లిక్ ఫైలింగ్ రిపోర్ట్లను విశ్లేషిస్తే తెలుస్తుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ఈ క్రమంలోనే నార్వేకు చెందిన పెన్షన్ ఫండ్ కేఎల్పీ.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి తన షేర్లను ఉపసంహరించుకొన్నట్టు వెల్లడించింది. ‘పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సహించే కేఎల్పీ.. బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకం. కాబట్టి, కార్మికెల్ కోల్ ప్రాజెక్టుకు ఏ విధంగానైనా నిధులు సమకూరితే, అది మా కట్టుబాట్లను ఉల్లంఘించడమే అవుతుంది’ అని హెడ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ కేఎల్పీ అసెట్ మేనేజ్మెంట్ కిరణ్ అజీజ్ తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ విషయంలో అదానీ గ్రూప్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు నార్వే ప్రభుత్వానికి చెందిన వెల్త్ ఫండ్ ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని బట్టి తెలుస్తున్నది. అదానీ గ్రూప్లో పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకున్నట్టు వెల్త్ ఫండ్ ఇటీవల ప్రకటించడమే దీనికి నిదర్శనం. 2022 చివరి నాటికి ఈ నార్వేజియన్ ఫండ్ వద్ద 52.7 మిలియన్ డాలర్ల విలువైన అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు, 83.6 మిలియన్ డాలర్ల అదానీ టోటల్ గ్యాస్ షేర్లు, 63.4 మిలియన్ డాలర్ల అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.1,800 కోట్లు. ఈ షేర్లన్నింటినీ ఇటీవలి కాలంలో విక్రయించినట్టు నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ ఈఎస్జీ రిస్క్ మానిటరింగ్ హెడ్ క్రిస్టోఫర్ రైట్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈఎస్జీ(ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) అంశాలపై ఎన్నో ఏండ్లుగా అదానీ గ్రూప్ను తాము గమనిస్తున్నామని, 2014 నుంచి 2022 వరకూ ఐదు అదానీ కంపెనీల షేర్లను విక్రయించామని, అప్పటి నుంచి మరో మూడు కంపెనీల షేర్ల నుంచి సైతం వైదొలిగామని, ఇక ఆ గ్రూప్లో తమకు వాటాలేవీ లేవని వివరించారు. మరోవైపు, యురోపియన్ యూనియన్కు చెందిన 500కు పైగా ఫండ్ రిజిస్టర్డ్ కంపెనీలు అదానీ స్టాక్స్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా విక్రయించడం లేదా కొత్తగా అనుమతించకపోవడం చేయవచ్చని బ్లూమ్బర్గ్ విశ్లేషించింది. దీనిపై అదానీ గ్రూప్ ప్రతినిధులను స్పందన కోరగా, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వెల్లడించింది. హరిత పునరుత్పాదక శక్తి రం గంలో అత్యంత చౌకగా సేకరించిన పెట్టుబడులను బొగ్గు తవ్వకాల కోసం అదానీ గ్రూప్ తరలిస్తున్నదని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘బ్లూమ్బర్గ్’ నివేదికను పోస్ట్ చేశారు.
పర్యావరణహిత విధానాల కోసం పెట్టుబడులు సమీకరించి, వాటిని ప్రమాదకర బొగ్గు తవ్వకాలకు వినియోగించడం అదానీ కార్పొరేట్ చరిత్రకు నిదర్శనం.
– కిరణ్ అజీజ్, హెడ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ కేఎల్పీ అసెట్ మేనేజ్మెంట్
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. పర్యావరణహితం కోసం మీరు పెట్టిన పెట్టుబడులు.. ప్రకృతిని నాశనం చేసే కార్మికెల్ కోల్ మైన్ వంటి ప్రాజెక్టుకు పునాదిగా మారొచ్చు.
– ఉల్ఫ్ ఎర్లాండ్సన్, సీఈవో, ఆంత్రో పొసెన్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్టిట్యూట్
(స్పెషల్ టాస్క్ బ్యూరో)