న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ‘గ్రామీణ భారత్ బంద్’ నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు ‘చక్కా జామ్’ను చేపడతారు.
వ్యవసాయ, ఉపాధి హామీ పనులు ఉండవని, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికులెవ్వరూ పనిచేయరని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్ చెప్పారు. కూరగాయల అమ్మకం సహా గ్రామాల్లో సమస్తం బంద్ అవుతుందని తెలిపారు. అంబులెన్సులు, వివాహాలు, అంత్యక్రియలు, మెడికల్ దుకాణాలు, వార్తా పత్రికల సరఫరా, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు, అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చామని ఎస్కేఎం జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ దర్శన్పాల్ తెలిపారు.
స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణాల మాఫీ, సమగ్ర పంటల బీమా, వ్యవసాయం, గృహవసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ, కార్మిక చట్టాల సవరణల ఉపసంహరణ.. తదితర డిమాండ్లను రైతులు కేంద్రం ముందుంచారు.
రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం గురువారం మూడో రోజుకు చేరుకుంది. పంజాబ్లో రైతులు రైల్ రోకో నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు ముందు దేశవ్యాప్తంగా చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించారు. పంజాబ్, హర్యానా సరిహద్దుకు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఢిల్లీ చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు 30 వెల టియర్ గ్యాస్ షెల్స్ను ఆర్డర్ పెట్టాయి. శింభు సరిహద్దు వద్ద, హర్యానాలోని 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై, బల్క్ ఎస్ఎంఎస్ పోస్టులపై నిషేధాన్ని శనివారం వరకు ప్రభుత్వం పొడగించింది. శుక్రవారం పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, గురువారం చండీగఢ్లో రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య మూడో రౌండ్ చర్చలు జరిగాయి. 17 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్ చర్చలు జరిపారు.