లక్నో, జూన్ 4: బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 2014లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 74 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు ఇక్కడ బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నది. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చలేదు. ఆ పార్టీ గొప్పగా చెప్పుకున్న యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలసీ బెడిసికొట్టింది. రాష్ట్రం నుంచే పోటీ చేసినప్పటికీ మోదీ మ్యాజిక్ ఈసారి పని చేయలేదు. అప్నాదల్(సోనేవాల్), ఆర్ఎల్డీ, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, నిషాద్ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ చేసిన ప్రయత్నాలు కూడా అంతగా ఫలించలేదు.
ఉత్తరప్రదేశ్లో పదేండ్ల తర్వాత మొదటిసారి బీజేపీ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు ఇండియా కూటమికి సత్ఫలితాలను ఇచ్చింది. 2014లో కేవలం 5 స్థానాలు, 2019లో 5 స్థానాలకే పరిమితమైన సమాజ్వాదీ పార్టీ ఈసారి 62 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 37 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఆరు స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన అమేథీలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్.. స్మృతి ఇరానీని ఓడించారు.
ఎన్డీయే 37
ఇండియా 42
ఇతరులు 1