న్యూఢిల్లీ, జూన్ 26: 18వ లోక్సభ స్పీకర్గా అధికార ఎన్డీయే కూటమి బలపర్చిన అభ్యర్థి, బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం ఎన్నికయ్యారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కే సురేశ్పై ఆయన విజయం సాధించారు. సభలో చేపట్టిన మూజువాణి ఓటింగ్ అనంతరం ఓం బిర్లా గెలిచినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. దీంతో గత టర్మ్లో కూడా స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన ఓం బిర్లా వరుసగా రెండోసారి ఆ పదవిని చేపట్టారు. రెండోసారి స్పీకర్ అయిన వాళ్లలో ఓం బిర్లా ఐదో వ్యక్తి. స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ఎంపీలు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత మోదీ, రాహుల్ వెంట రాగా.. ఓం బిర్లా స్పీకర్ కుర్చీలో ఆసీనులయ్యారు.
ఈ సందర్భంగా మోదీతో రాహుల్ కరచాలనం చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ గత టర్మ్లో సభ కార్యకలాపాలను నిర్వహించడంలో ఓం బిర్లా సమతుల్యత పాటించారని, చాలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొన్నారని ప్రశంసించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పని కొత్త ఎంపీలకు స్ఫూర్తి అన్నారు. రాహుల్, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు మాట్లాడుతూ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు అవకాశాలు ఇవ్వాలన్నారు. ఎంపీల సస్పెన్షన్లు మరోసారి జరుగకూడదని పలువురు విపక్ష ఎంపీలు పేర్కొన్నారు. విపక్షం గొంతును అణచివేసి, సభను నడపటం అనేది ఒక అప్రజాస్వామిక ఆలోచన అని రాహుల్ బీజేపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు.
బుధవారం లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కొత్త సభాపతిగా ఓంబిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు ఎన్డీయే ఎంపీలు బలపర్చారు. అనంతరం ఇండియా కూటమి తరపున కే సురేశ్ పేరును శివసేన(యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించారు. దీన్ని పలువురు విపక్ష సభ్యులు బలపర్చారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ కోసం విపక్షం పట్టుబట్టకపోవడంతో ప్రొటెం స్పీకర్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. తర్వాత ఓం బిర్లా గెలిచినట్టు ప్రకటించారు.
స్పీకర్ కుర్చీపై ఆసీనులైన అనంతరం ఓంబిర్లా మాట్లాడుతూ అధికార, విపక్షాలు కలిసి సభను నడుపుతాయని అన్నారు. ప్రతి ఒక్కరి మాట వినడమే ప్రజాస్వామ్య బలమని పేర్కొన్నారు. సభ ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్న ఓంబిర్లా.. విమర్శలు ఉండొచ్చు కానీ, ఆటంకాలు ఏర్పరచడం సభ సంప్రదాయం కాదని పేర్కొన్నారు. సభ్యులందరూ పార్లమెంటరీ సంప్రదాయాలను ఉన్నతంగా పాటించాలని కోరారు. కాగా, లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని స్పీకర్ ఓంబిర్లా గుర్తించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోటీ అనివార్యమైన విషయం తెలిసిందే. ఎన్డీయే తరపున ఓంబిర్లా మంగళవారం నామినేషన్ వేయగా.. విపక్ష ఇండియా నుంచి కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ పోటీలో నిలబడ్డారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న విపక్షాల కండీషన్కు అధికార పక్షం అంగీకరించకపోవడంతో దాదాపు గత 50 ఏండ్లలో తొలిసారి, స్వతంత్ర భారతంలో మూడోసారి స్పీకర్ ఎన్నిక జరిగింది.