న్యూఢిల్లీ, అక్టోబర్ 27: లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీలు పేదల కోసం అమలు చేసే పథకాలు దేశానికి ప్రమాదకరమని పేర్కొంది. ఉచిత విద్యుత్తు విషయంలో తన వ్యతిరేకతను ఎన్నికల కమిషన్కు రాసిన లేఖలో బహిర్గతం చేసింది. ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇవ్వటం వారిని ప్రలోభపెట్టడమేనని, ఉచిత విద్యుత్తు ఆ కోవలోకే వస్తుందని తెలిపింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నియమావళిని సవరించాలన్న తన ప్రతిపాదనపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలుపాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. తమ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి ఉన్న ఆర్థిక వసతులు ఏమిటో ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రమాదకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గత జూలైలో చేసిన వ్యాఖ్యలనే బీజేపీ తన లేఖలో పొందుపరిచినట్టు తెలుస్తున్నది. లేఖను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ నాయకుడొకరు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉచితాలు ఓటర్లను ప్రలోభ పెడతాయని, సంక్షేమ పథకాలు విధానపరమైన నిర్ణయాలని నిర్వచించారు. దీంతో పేదలకిచ్చే పెన్షన్లు, రుణ మాఫీలను కూడా బీజేపీ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తున్నది. ఉచితంగా ఇండ్లు కట్టించి ఇవ్వడం, రేషన్ సరుకులు సమకూర్చడం వేరని, ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం వేరని ఆ నాయకుడు పేర్కొన్నారు. ఇల్లు మౌలికపరమైన అవసరమని, అది ఒకసారి చేసే సహాయం మాత్రమేనని అన్నారు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా రేషన్ ఇవ్వటం సంక్షేమ చర్య అని, వీటిని ఉచిత విద్యుత్తుతో పోల్చరాదని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తునిస్తుండగా, ఢిల్లీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పేదలకు కొంత పరిమితి వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నది. ఈ ఏడాది జూలై 16న ఉత్తరప్రదేశ్లోని జాలౌన్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉచిత పథకాలు ‘రేవడీ’ సంస్కృతి అని, అది దేశాభివృద్ధికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో ఎన్మికల నియమావళిని సవరించేందుకు తమ అభిప్రాయాలు తెలపాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుంటూ ఉచిత పథకాల అంశం ఎంతో ప్రాముఖ్యం కలిగినదని, దీనిపై చర్చ జరగాలని పేర్కొన్నది.