న్యూఢిల్లీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య గట్టిపోటీ ఉంటుందని, హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన క్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సంప్రదింపులు జరిపారు.
ప్రధానితో భేటీ అనంతరం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ గోవాలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తాను మళ్లీ సీఎం పదవి చేపడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలో ఎన్నికల పరిస్ధితి గురించి తాను ప్రధాని మోదీకి వివరించానని చెప్పారు.
గోవాలో సీఎం అభ్యర్ధిని కాషాయ పార్టీ ఇంతవరకూ ప్రకటించకపోయినా రాష్ట్రాన్ని పాలించే అవకాశం పార్టీ తనకు మరోసారి కట్టబెడుతుందని ప్రమోద్ సావంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధిక అసెంబ్లీ స్ధానాలను గెలుచుకుని తాము గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సావంత్ స్పష్టం చేశారు. మార్చి 10న గోవా సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.