పట్నా: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తేలిగ్గా తీసిపారేశారు. ఇటీవల పూర్నియాలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ పైన, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసం నితీశ్ బీజేపీని వదిలేసి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేశాడని ఆరోపించారు.
ఇవాళ ఢిల్లీ టూర్కు బయలుదేరిన లాలూ ప్రసాద్ యాదవ్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా ఆయన.. ఆందోళన అక్కర్లేదు.. త్వరలోనే బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది అని తేలికగా సమాధానమిచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ రేపు ఢిల్లీలో నితీశ్కుమార్తో కలిసి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.