కోల్కతా: దేశవ్యాప్తంగా ఈ నెల 30న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ నెల 30న మొత్తం 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. దేశంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టంచేశాయి. మొత్తం మూడు లోక్సభ స్థానాల్లో పోటీచేసిన బీజేపీ రెండు చోట్ల ఓడి ఒక్కచోట మాత్రమే గెలిచింది. అదేవిధంగా మొత్తం 30 స్థానాలకు కేవలం 7 చోట్ల మాత్రమే గెలిచింది.
హిమాచల్ప్రదేశ్లోని మండి, మధ్యప్రదేశ్లోని ఖంద్వా, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలోని దాద్రానగర్ హవేలీ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. కేవలం ఖంద్వా నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ గెలిచింది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పశ్చిమబెంగాల్లోని 4 స్థానాల్లో, హిమాచల్ప్రదేశ్లోని 3 స్థానాల్లో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేశాయి.
పశ్చిమ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీపడ్డ బీజేపీకి మూడు చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక హిమాచల్ప్రదేశ్లో అధికారంలో ఉండి కూడా బీజేపీ చతికిలపడింది. మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే మూడు స్థానాల్లో బీజేపీకి పరాభవమే ఎదురైంది. ఇక కర్ణాటకలోనూ బీజేపీ అధికారంలో ఉన్నా హంగల్ అసెంబ్లీ స్థానంలో ఘోరంగా ఓడిపోయింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో ఈ నియోజకవర్గం ఉన్నా ఆయన తన పార్టీని గెలిచిపించుకోలేకపోయారు. ఇక మరో స్థానమైన సిండ్గీ కేవలం 7,500 ఓట్ల మెజారిటీ బీజేపీ బయటపడింది.
ఇక అసోంలోనూ బీజేపీ 5 స్థానాల్లో పోటీచేసి కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలువగలిగింది. మధ్యప్రదేశ్లోనూ మూడు స్థానాల్లో పోటీ రెండు స్థానాల్లో నెగ్గింది. తెలంగాణలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నెగ్గినా.. అది అభ్యర్థి ఇమేజ్తో దక్కిన విజయమే తప్ప బీజేపీ గొప్పతనంగా చెప్పలేం. మొత్తంగా చూస్తే 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ కేవలం అసోంలో 3 స్థానాల్లో, మధ్యప్రదేశ్లో రెండు స్థానాల్లో, కర్ణాటక, తెలంగాణలో ఒక్కో స్థానంలో గెలిచింది. మిగతా అన్ని స్థానాల్లో ఆ పార్టీకి ఓటమే గతి అయ్యింది.