ED | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): విపక్షాలను వేధించేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను అస్ర్తాలుగా ఉపయోగించుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఏదో ఒక ఆరోపణ తెరపైకి తేవడం, విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరపడం, రోజుల తరబడి వారిని విచారించడమే ఈ సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. ఈ తతంగమంతా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో జరుగుతున్నట్టు ఇటీవలి పరిణామాలు చూస్తుంటే స్పష్టమవుతున్నది. అమిత్ షా ఈమధ్య ప్రతి పక్షాలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తే ఆ రాష్ట్రంలో ఈ సంస్థలు దిగిపోతున్నాయి.
తమిళనాడులో..
ఇటీవల అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన రెండు రోజులకే ఈడీ ఆ రాష్ట్ర విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకున్నది. ఆయన ఇల్లు, సన్నిహితుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆ రాష్ట్ర సచివాలయంలోనే సోదాలు నిర్వహించింది. అనంతరం సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది. షా ప్రోద్బలంతోనే ఈడీ దాడులు జరుగుతున్నాయని అధికార డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో..
అమిత్ షా బుధవారం సాయంత్రం తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా ఉదయమే ఆదాయ పన్ను విభాగం రంగంలోకి దిగింది. అధికార బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా దాడులు సాగించింది. వారి ఆస్తులు, వ్యాపార సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిపింది. రాష్ట్రంలో బీజేపీ ఉనికి తగ్గిపోతున్న పరిస్థితుల్లో, మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఐటీని రంగంలోకి దింపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో..
తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 14న అమిత్ షా పర్యటించారు. అదే రోజు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహ ఇంట్లో సోదాలు జరిపింది. మే 4న తృణమూల్ కీలక నేత, ఎంపీ అభిషేక్ ముఖర్జీ సన్నిహితుడు సుజయ్ కృష్ణ భద్ర, టీఎంసీ నేతల ఇండ్లల్లో సీబీఐ సోదాలు చేసింది.
బీహార్లో..
జేడీయూ – ఆర్జేడీ కూటమి అధికారంలో ఉన్న బీహార్లో ఫిబ్రవరి 25న అమిత్ షా పర్యటించారు. మార్చి 10న బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎమ్మెల్యే, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ సన్నిహితుడు సయ్యద్ అబు దొజానా ఇండ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. మార్చి 11న తేజస్వీ యాదవ్కు సీబీఐ సమన్లు ఇచ్చింది. ఏప్రిల్ 2న మరోసారి అమిత్ షా బీహార్లో పర్యటించారు. ఆ తర్వాత కూడా కేంద్ర దర్యాప్తుల దాడులు కొనసాగాయి.
జార్ఖండ్లో
జార్ఖండ్లో ఫిబ్రవరి 4న అమిత్ షా పర్యటించారు. ఫిబ్రవరి 21న గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలు జరిగాయంటూ ఈడీ దాడులు చేపట్టింది. మార్చి 4న , మే 30న వివిధ కేసుల్లో ఈడీ సోదాలు జరిపింది.
ప్రతిపక్షాలను బద్నాం చేయడమే ఉద్దేశం
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కేవలం బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల నేతలను మాత్రమే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఏవేవో ఆరోపణలను తెరపైకి తెచ్చి సోదాలు చేస్తున్నాయి. వీటి ద్వారా ఆయా పార్టీలను తాత్కాలికంగా బద్నాం చేయాలనే ఉద్దేశమే ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నది. ఇన్ని ఆరోపణలు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటిని నిరూపించేది మాత్రం చాలా చాలా తక్కువ. 2005 నుంచి ఈడీ 5,906 కేసులు నమోదు చేయగా అందులో కేవలం 24 కేసుల్లో మాత్రమే దోషులను తేల్చింది.