లక్నో, మే 29: ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్’ పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకం అమలు ఆయన పార్టీ అధికారంలో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. దేశంలో జేజేఎం పథకం అత్యంత తక్కువ స్థాయిలో అమలవుతున్నది ఉత్తరప్రదేశ్లోనే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ చేసింది. ఇప్పటి వరకు యూపీలో జేజేఎం పథకం 13.75% ప్రజలకు మాత్రమే చేరింది. అదే సింగిల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఎప్పటినుంచో నూటికి నూరు శాతం కుటుంబాలకు నల్లా ద్వారా అత్యంత సురక్షిత తాగునీరు అందుతున్నది.
నిధులిచ్చినా నీళ్లియ్య చేతకాలే..
ఉత్తరప్రదేశ్లో తాగునీరు అందించేందుకు కేంద్రప్రభుత్వం కోట్లకు కోట్లు నిధులిస్తున్నది. ఒక్క 2021-22 బడ్జెట్లోనే ఈ పథకం కింద యూపీకి రూ.10,870 కోట్లు కేటాయించింది. 2021 ఆగస్టు 6న ఒకే దఫాలో ఏకంగా రూ.2,400 కోట్లు విడుదల చేసింది. 2019-20లో రూ.1,206 కోట్లు విడుదల చేసింది. ఇంత భారీ స్థాయిలో ఏ రాష్ర్టానికీ కేంద్రం నిధులివ్వలేదు. అయినా, జేజేఎం అమలులో యూపీ అట్టడుగున ఉండటం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
జేజేఎంకు మూడేండ్ల ముందే మిషన్ భగీరథ
కేంద్రప్రభుత్వం 2019 ఆగస్టు 15 జేజేఎంను ప్రారంభించగా, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు మూడేండ్ల ముందు.. అంటే 2016 ఆగస్టు 6నే మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. జేజేఎం ప్రారంభానికి ముందే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించటం మొదలైంది. ఈ పథకానికి రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా రూ.43,791 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకానికి కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 50% ఇండ్లకే నల్లా కనెక్షన్లు ఉండగా, తెలంగాణలో 100% ఇండ్లకు నల్లా నీళ్లు సరఫరా అవుతున్నాయని జల్శక్తి శాఖ పేర్కొంది.