Tribunals Bill : ట్రిబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రతిపాదించిన ‘ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు-2026 (Tribunals Amendment bill-2026)’ కు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. సోమవారం సభలో వివిధ అంశాలపై విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) ఈ బిల్లును సభలో లోక్సభలో ప్రవేశపెట్టారు.
ట్రిబ్యునళ్ల నియామకాల్లో పారదర్శకత, స్వతంత్రత, ఏకరూపతను తీసుకురావడంతోపాటు వాటి పనితీరులో సమర్థతను పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ బిల్లు చట్టంగా మారితే దేశంలో ‘నేషనల్ ట్రిబ్యునళ్ల కమిషన్ (National Tribunals Commission)’ ఏర్పాటవుతుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించే ఈ కమిషన్లో ఛైర్పర్సన్తోపాటు ఇద్దరు న్యాయ, ఇద్దరు సాంకేతిక రంగ నిపుణులు సభ్యులుగా ఉంటారు.
ఈ కొత్త చట్టం ద్వారా ట్రిబ్యునళ్ల నియామకాలు, అర్హతలు, పదవీకాలం, వేతనాలు, సభ్యుల తొలగింపు తదితర అంశాలపై స్పష్టమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ బిల్లు తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 2021 నాటి ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం రద్దవుతుంది.