Maharashtra | ముంబై, జూన్ 12: మహారాష్ట్రలోని బీజేపీ – శివసేన (ఏక్నాథ్ శిండే వర్గం) కూటమికి బీటలు వారుతున్నదా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విశ్లేషకుల అనుమానాలకు బలం చేకూర్చేలా రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని కోరుతూ స్థానిక బీజేపీ నేతలు ఓ తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు పంపించడం చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ్- డొంబివ్లి రీజియన్ల బీజేపీ నేతలు ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని శివసేనపై గుర్రుగా ఉన్నారు.
అసలేంటీ వివాదం…
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ శిండేను ఉద్దేశిస్తూ వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ స్థానిక నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ శిండే మండిపడ్డారు. దీంతో తమ మద్దతు లేకుండా గెలవలేరని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ శ్రీకాంత్ శిండేకు చురకలు అంటించారు. ఒంటరిగా పోటీ చేయాలని తీర్మానం చేసి బీజేపీ పార్టీ పెద్దలకు పంపించారు. దీంతో వెనక్కితగ్గిన శ్రీకాంత్ శిండే తనకు పదవులు అవసరం లేదని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.