కల్వకుర్తి, ఆగస్టు 8 : రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఏజెండాగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లు యథేచ్ఛగా దిగువకు తరలివెళ్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పక్క రాష్ట్ర పాలకుల మెప్పు కోసం నాయకులు తహతహలాడుతున్నారు.ఇది సహించలేని బీఆర్ఎస్ నాయకులు కన్నెర్ర చేశారు.
పాలమూరుకు అన్యాయం జరిగితే సహించమంటూ ఎదురుతిరిగారు. నిండుగా పారుతున్న కృష్ణమ్మను పాలమూరు జిల్లాలకు తరలించకుంటే లక్ష మంది రైతులతో ప్రాజెక్టును ముట్టడిస్తామని హెచ్చరించారు. నదిలో నిండుగా నీరు పారుతున్నా.. శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారుతున్నా.. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని, ఇందులో ఉన్న కుట్ర ఏమిటని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కేటీఆర్ ఆధ్వర్యంలో లక్ష మంది రైతులతో ప్రాజెక్టులను ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ పాలకుల్లో కదలిక వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల మోటర్లు ఆన్ చేయడంతో పాటు కాల్వల్లోకి నీళ్లు వదిలారు.
ఎగువ నుంచి వరద ప్రారంభమై 15 రోజులు కావొస్తుంది. ఇలాంటి సమయంలోనే నీటిని ఎత్తిపోయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. నిత్యం 2 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుకుంటున్నా.. ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడంపై దృష్టి సారించడం లేదు. రైతుల శ్రేయస్సును గాలికొదిలేసిందనే విమర్శలను మూటగట్టుకున్నది. ఏపీ మాత్రం శ్రీశైలానికి చేరుతున్న నీటిని తమ ప్రాజెక్టులకు తరలిస్తూ తప్పుడు లెక్కలు చెబుతున్నా అభ్యంతరం చెప్పని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉండిపోయింది.
ఇక్కడి బిడ్డల ప్రయోజనాలే తమ లక్ష్యంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. పాలమూరును ఏడారి చేస్తారా..? పాలమూరు బిడ్డలను ఆగం చేస్తారా? అంటూ గర్జించారు. కృష్ణమ్మ నిండుగా పారుతున్నా.. నీటిని పాలమూరు ప్రాజెక్టులకు ఎందుకు ఎత్తిపోయరంటూ ప్రభుత్వంపై దాడికి దిగారు. ఏపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నారు..? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ? ప్రశ్నల వర్షం కురిపించారు. కాకమ్మ కథలు మాని ప్రాజెక్టులకు నీళ్లు ఎత్తిపోయకుంటే రైతులతో కలిసి కనీవిని ఎరుగని ఉద్యమానికి తెరలేపుతాయని హెచ్చరించారు.

ప్రాజెక్టులకు నీళ్లు ఎత్తిపోయని పక్షంలో కేటీఆర్ సారథ్యంలో లక్షమంది రైతులతో పాలమూరు ప్రాజెక్టుల వద్దకు వస్తామని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, ప్రాజెక్టుల వద్దనే నిరాహార దీక్ష చేస్తామని మరో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఏది ఏమైనా రైతులకు సాగునీరు ఇచ్చేందుకు నీటిని ఎత్తిపోయాల్సిందేనని, అందుకోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నీళ్లు ఎత్తిపోయకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాజెక్టుల వద్దకు వస్తారనే బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో.. ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏదైనా జరిగితే అసలుకే మోసం వస్తుందని భావించి శుక్రవారం అర్ధరాత్రి ఎత్తిపోతల మోటర్లు ఆన్ చేసింది. అదే సమయంలో పంట పొలాలకు అందించే 28, 29, 30 ప్యాకేజీ కాల్వలకు నీళ్లు వదిలారు. రిజర్వాయర్ల సమీపంలో ఉన్న రైతులు ఉదయాన్నే వ్యవసాయ పొలాలకు వెళ్లగా కాల్వలో నీళ్లు ప్రహించడాన్ని చూసి ఆశ్యర్యపోయారు. అదేంది.. హంగూ.. ఆర్భాటం లేకుండా నీరు వదిలారని, ఇదంతా బీఆర్ఎస్ దెబ్బ అని చర్చించుకున్నారు.
కృష్ణమ్మకు వరద వచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయడం.. ఎత్తిపోసిన జలాలను కాల్వలకు వదలడం.. కాల్వలకు నీళ్లు వదిలేటప్పుడు కృష్ణమ్మకు పూజలు నిర్వహించడం బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు కృష్ణమ్మకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి అదేందో గానీ.. చడీచప్పుడు లేకుండా కాల్వలకు నీళ్లను వదిలారు. ఆర్భాటం చేయడానికి వెనుకంజ వేశారు.. ‘హనుమంతుని చేయబోతే కోతి అవుతుంది’ అని భావించిన అధికార పార్టీ నాయకులు గమ్మున ఉండిపోయారు.
వానకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. ప్రభుత్వం సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు సాగునీటిని వదిలింటే బాగుండేది. బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో నైనా ప్రభుత్వం జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఇప్పటికే రైతులు బోరు, బావుల కింద వరి నాట్లు వేశారు. వరి నారు ముదిరిన తర్వాత నీళ్లు వదిలితే లాభం లేదు. అయినా కనీసం బీఆర్ఎస్ ఒత్తిడి మూలంగా సాగునీళ్లు విడుదల చేసినందుకు సంతోషంగా ఉన్నది. మళ్లీ సాగునీరు బంద్ చేయకుండా పంటకాలం పూర్తయ్యేవరకు సాగు నీళ్లను అందించాలి.
– వెంకటస్వామి, రైతు నాగలపల్లి, కొల్లాపూర్
సాగునీటి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సరైన సమయానికి సాగునీరు వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులు, సాగునీటి కోసం తంటాలు పడుతున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికతో ప్రభుత్వంలో కదిలిక వచ్చి సాగునీరు విడుదల చేశారు. దీంతో పంటల కాల్వలకు ఎంజీకేఎల్ఐ
నీళ్లు రావడం ప్రారంభమైనది. పంట పొలాలకు ఈ సీజన్లో ఎంజీకేఎల్ఐ నీళ్లు రావనే అనుమానంలో ఉన్నాం. కానీ బీఆర్ఎస్ నాయకుల పుణ్యమా అని సాగునీళ్లు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– నర్సింహారెడ్డి, జటప్రోల్, కొల్లాపూర్