కోల్కతా, జనవరి 6: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, రెండుమూడు అంతస్థుల భవనాలు ఉండి కూడా పీఎంఏవై డబ్బులు నొక్కేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ నేతల అవినీతి కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఎందుకు విచారణ కోసం బృందాలను పంపించడం లేదు? అని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం విచారించి భవనాలు ఉన్న వారికి చెందిన 17 లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. బెంగాల్కు నరేగా నిధులు ఇవ్వడం లేదని, తమ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తున్నదని ఆరోపించారు. బెంగాల్లో 20 లక్షల నకిలీ నరేగా జాబ్ కార్డులు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న 69 లక్షల నకిలీ జాబ్ కార్డుల సంగతేంటని ఆమె ప్రశ్నించారు.