హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మద్దతు తెలిపారు. చేనేత విభాగం ప్రధాని మోదీకి రాసిన మహా వస్త్ర లేఖపై సంతకం చేశారు.
జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతును కూడగట్టడంలో భాగంగా చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేతలు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. అందులో భాగంగా రామమూర్తిని బెంగుళూరులో గురువారం కలిసి మద్దతు కోరారు. అందుకు రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు, జీరో జీఎస్టీ కోసం చేపట్టాల్సిన విధాన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సినీ నటి పూనమ్కౌర్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.