బెంగళూరు: ఏకంగా 126 భారీ చెట్లను అక్రమంగా నరికినందుకు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాను బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. హసన్ జిల్లా నందగొండనహళ్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలోని వందలాది భారీ చెట్లను విక్రమ్ సింహా కూల్చేశాడని, ప్రభుత్వ అనుమతులు లేకుండా చెట్లను నరికాడని, కలప స్మగ్లింగ్కు పాల్పడ్డాడని విక్రమ్ సింహాపై అటవీ శాఖ అరోపణలు నమోదుచేసింది.
‘50 నుంచి 60 ఏండ్లున్న చెట్లను నరికివేయటం దారుణం. అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం అతడిపై చర్యలు చేపట్టాం’ అని కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖాంద్రే తెలిపారు. అయితే.. తనపై వచ్చిన ఆరోపణల్ని విక్రమ్ సింహా కొట్టిపారేశారు. తనను, ఎంపీ ప్రతాప్ సింహాను ఇబ్బందుల్లో నెట్టేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్స్ పాస్ ఇచ్చిన కారణంగా బీజేపీ ఎంపీ ప్రతాస్ సింహా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.