న్యూఢిల్లీ, ఆగస్టు 9: ‘గెలువలేనప్పుడు గందరగోళం సృష్టించాలి’.. ‘అధికారం అధికారాన్ని సృష్టిస్తుంది’.. రాజకీయాల్లో తరుచూ వినిపించే మాటలివి. బీజేపీ ఇప్పుడు ఈ రెండు సిద్ధాంతాలను ఏకకాలంలో అమలుచేస్తున్నది. తనకు బలం లేనిచోట మతం పేరుతో విద్వేషం ప్రజ్వరిల్లజేసి సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నది. మరోవైపు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ర్టాల ఎన్నికల్లో తాము మాత్రమే గెలిచేలా ప్రతిపక్షాలను నియంత్రించే చర్యలకు దిగింది. త్వరలో కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తోపాటు పలు ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. సహజంగానే ఎన్నికల సమయంలో తమకు ఏ పార్టీ ఎక్కువ ప్రయోజనం కలిగించే పథకాలు ప్రకటిస్తుందో ఓటర్లు వారివైపే మొగ్గుతారు.
మతం, కులం భావోద్వేగాలున్నప్పటికీ సంక్షేమ పథకాల వంటివి ఆర్థిక అంశాలు అంతిమంగా గెలుపును నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యం లో ప్రతిపక్ష పార్టీలు ‘సంక్షేమ పథకాల’ హామీ ఇవ్వకుండా మోదీ సర్కారు తెరవెనుక ప్రమాదకర కుట్ర మొదలుపెట్టింది. పేదలను ఆదుకొంటున్న పెన్షన్లు, ఉచిత విద్యుత్తు, జీవిత బీమా వంటి పథకాలను పూర్తిగా రద్దుచేసేలా ఆర్థిక నిర్వహణ పేరుతో రాష్ర్టాలను ఎండబెడుతున్నది. దీంతో త్వరలో జరుగబోయే అసెంబ్లీ, ఆ తర్వాత వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నిర్ణయించే అంశాలే ఎన్నికల ఎజెండా కావాలని ప్రయత్నిస్తున్నదని రాజకీయ నిపుణుల విశ్లేషణ.
నిధులు అందకుండా కుట్ర..
మోదీ నేతృత్వంలో 2014లో ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ర్టాల అధికారాలను తగ్గించటం మొదలుపెట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై తరుచూ వివాదాస్పద చట్టాలు చేయటంతో మొదలుపెట్టి పన్నుల వ్యవస్థ సంస్కరణ పేరుతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమల్లోకి తేవటం వరకు మోదీ సర్కారు చర్యలన్నీ రాష్ర్టాల హక్కులను వీలైనంత పరిమితం చేశాయి. అయినా, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ర్టాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పేదలకు చేయూతనందించేందుకు పెన్షన్లు, ఉచిత విద్యుత్తు, రైతులకు పంటపెట్టుబడి, చేతివృత్తులకు చేయూతనిచ్చే కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో బీజేపీ మత విద్వేష ఆటలు చెల్లటం లేదు.
కేంద్రం అన్ని వస్తువులపై ఎడాపెడా పన్నులేస్తూ ధరల పెరుగుదలకు కారణం అవుతుంటే, రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకొంటున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నది. దీంతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు నిధుల కటకట సృష్టించే చర్యలకు మోదీ సర్కారు దిగిందని అంటున్నారు. సాధారణంగా సంక్షేమ పథకాలు భారీగా అమలుచేసే రాష్ర్టాలు అవసరమైన అదనపు నిధులను రుణాల రూపంలో సేకరిస్తుంటాయి. ఇక్కడే మోదీ సర్కారు తమ ప్లాన్ను మొదలు పెట్టింది. పేదలకు అందించే ‘ఉచిత’ పథకాలకు నిధులు ఎక్కడినుంచి సమకూరుస్తారో ముందుగానే చెప్పాలని రాష్ర్టాల మెడపై కత్తి పెడుతున్నది. వాటికి బడ్జెటేతర రుణాలు తీసుకోరాదని షరతు పెడుతున్నది.
ద్రవ్యలోటు భారీగా చూపించే ఎత్తుగడ
రాష్ర్టాల బడ్జెట్లో ద్రవ్యలోటును భారీగా చూపించటం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చేలా చేసేందుకు మోదీ సర్కారు ఎత్తు వేసిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు బార్బ ర్ షాపుల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. ఈ పథకానికి అవసరమయ్యే నిధులను రాష్ట్రం ఎక్కడి నుంచి తెస్తుందో ముందే చెప్పాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఖర్చుపెట్టే మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ లెక్కల్లో ద్రవ్య లోటుగా పేర్కొనాలి.
అప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ర్టాల్లో కూడా ద్రవ్యలోటు భారీగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆ అప్పులన్నీ ప్రజల నుంచే వసూలు చేస్తారంటూ బీజేపీ ప్రచారం మొదలుపెడుతుంది. పదేపదే ఇదే ప్రచారం బలంగా చేస్తే ఆ పథకాల ప్రయోజనాలు పొందుతున్న ప్రజలు కూడా ఆ ట్రాప్లో పడిపోయి బీజేపీ చెప్పినట్టు వింటారు. అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇదే బీజేపీ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఎన్నికల్లో విపక్షాలను తొక్కే కుట్ర
రానున్న డిసెంబర్లోగుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలకు, జనవరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మార్చిలో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్లో ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ ఉన్నది. 2024 పార్లమెంటు ఎన్నికల ముందు వచ్చే ఈ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రధానం. ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే పథకాలు ప్రకటించకుండా మోదీ సర్కారు తన అధికారాన్ని ఉపయోగించి ముందుగానే కట్టడి చేసే చర్యలు చేపట్టిందని మేధావులు అంటున్నారు.
ఇటీవల యూపీలో పర్యటించిన ప్రధాని మోదీ, ఉచిత పథకాలు పేదలకు జీడిపప్పును ఎరగా వేసినట్టుగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. మతం పేరుతో చేసే రాజకీయమే తమకు ఎక్కడైనా అధికారం కట్టబెడుతుందని, దానికి అడ్డుగా వచ్చే ఉచిత పథకాలను ప్రారంభంలోనే తుంచివేయాలన్న ఉద్దేశం మోదీ వ్యాఖ్యల్లో కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. మొదటి నుంచీ ధనికుల కోసం మాత్రమే పనిచేస్తున్న బీజేపీ ఇప్పుడు పేదలకు అందుతున్న ఉచిత పథకాలను దెబ్బకొట్టాలనుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొంటున్నారు.
సంక్షేమానికే పెద్దపీట వేసిన ధనిక దేశాలు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ముఖ్యంగా ధనిక దేశాలు సైతం సామాజిక సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నాయి. ధనిక దేశాల ప్రభుత్వాలైతే మొత్తం జీడీపీలో కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే 28 శాతంపైగా నిధుల్ని వెచ్చిస్తున్నాయి. ఆరోగ్య సంబంధిత పథకాలు, వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబ వ్యయాలకు మద్దతునిచ్చే పథకాలు, ఉపాధి కల్పన సంబంధిత పథకాలకు ప్రభుత్వాలు వ్యయపర్చడం ద్వారా పేదరికాన్ని గణనీయంగా తగ్గించుకున్నాయి. అత్యధికంగా ఫ్రాన్స్ తమ దేశ జీడీపీలో 31.5 శాతం నిధులను ఖర్చు చేస్తున్నది.