ముంబై : ముంబై-గోవా హైవే ప్రాజెక్టులో జాప్యంపై సొంత ప్రభుత్వంపైనే బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతాం విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. 582 కిలోమీటర్ల ముంబై-గోవా హైవే ప్రాజెక్టు పూర్తవడంలో విపరీతమైన జాప్యం నెలకొంటోందని మహా సర్కార్ను కాషాయ పార్టీ ఎమ్మెల్యే అమిత్ నిలదీశారు.
ఈ రోడ్డు ఎప్పటికి పూర్తవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని అసెంబ్లీ వేదికగా అమిత్ శివసేన (షిండే)-బీజేపీ సంకీర్ణ సర్కార్ను ఆయన ప్రశ్నించారు. 780 కిలోమీటర్ల ముంబై-నాగపూర్ హైవే నాలుగేండ్లలో పూర్తయితే 582 కిలోమీటర్ల పొడవైన ముంబై-గోవా హైవే ప్రాజెక్టు తొమ్మిదేండ్లయినా ఇప్పటికీ పూర్తికావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో పలు డెడ్లైన్లు విధించినా ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తికావడం లేదని ఈ రోడ్డు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా వెల్లడించాలని పీడబ్ల్యూడీ మంత్రి రవీంద్ర చవాన్ను ఆయన నిలదీశారు. తొలి దశలో 40 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు ఐదేండ్ల సమయం పట్టిందని ఇలాగైతే మహారాష్ట్ర అంతటా రోడ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తిచేస్తారని ప్రశ్నించారు. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం 9 నెలల్లో పూర్తవుతుందని మంత్రి రవీంద్ర చవాన్ బదులిచ్చారు.
Read More :