న్యూఢిల్లీ: రాజ్యసభ సజావుగా సాగింది కొంతసేపే అయినా మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విసురుకున్న వ్యంగ్యాస్త్రాలతో సభలో నవ్వులు విరబూశాయి. త్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, తమిళనాడు షార్ట్ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడంతో రాజ్యసభ రెండు టీమ్లకు అభినందనలు తెలిపింది.
ఈ అంశంపై మాట్లాడే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు.. ప్రతిపక్ష సభ్యులతోపాటు అధికార పార్టీ సభ్యులకు, చైర్మన్కు కూడా నవ్వు తెప్పించాయి. ‘ఆస్కార్ అవార్డు గెలిచిన రెండు దక్షిణ భారత టీమ్లకు అభినందనలు. రెండు భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డులు దక్కడంతో నేను గర్వంగా ఫీలవుతాన్నా’ అని ఖర్గే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
‘కానీ అధికార పార్టీకి నా నుంచి ఒకే ఒక విన్నపం. దయచేసి ఈ ఆస్కార్ అవార్డుల క్రెడిట్ను మాత్రం మీ ఖాతాలో వేసుకోకండి. ఆ సినిమాలను డైరెక్ట్ చేసింది మోదీనే అని, పాట రాసింది మేమే, డైరెక్ట్ చేసింది మేమే అని చెప్పకండి. అదొక్కటే నా విజ్ఞప్తి’ అని ఖర్గే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఖర్గే ఆ మాట అనగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా ఒక్కసారిగా గొల్లున నవ్వారు.
ప్రతిపక్ష సభ్యులే కాదు, అధికార పార్టీ సభ్యుల ముఖాల్లో కూడా నవ్వులు కనిపించాయి. సభా నాయకుడు పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ముఖాల్లో నవ్వులు విరిశాయి. ఆఖరి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కూడా ఖర్గే మాటలకు నవ్వును ఆపుకోలేకపోయారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.
Oscar winning ‘RRR’ and The Elephant Whisperes’ are India’s contributions to the world.
We request Modi ji not to take the credit for their win.
:Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF
— Congress (@INCIndia) March 14, 2023