న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సుప్రీంకోర్టు రద్దు చేసిన ఎన్నికల బాండ్ల పథకాన్ని మళ్లీ తీసుకురావాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. 2024లో మళ్లీ అధికారంలోకి వస్తే సంప్రదింపులు జరిపి ఎన్నికల బాండ్లను తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు ఆమె తెలిపారు. ‘ఎన్నికల బాండ్లకు సంబంధించి భాగస్వామ్యపక్షాలతో చాలా సంప్రదింపులు జరపాల్సి ఉంది.
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రూపకల్పన చేయాలి. ముఖ్యంగా పారదర్శకత కొనసాగేందుకు, నల్లధనం ప్రవేశించే అవకాశాన్ని పూర్తిగా తొలగించేందుకు ఏమేం చేయగలమో చూడాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత తీసుకువచ్చిందని, అంతకుముందు యథేచ్ఛగా ఉండేదని తెలిపారు. బాండ్ల పథకంలోని కొన్ని అంశాలను ఇంకొంత మెరుగుపర్చాల్సి ఉందని, ఇందుకోసం సంప్రదింపులు జరిపి మళ్లీ తీసుకువస్తామని ఆమె స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరే విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు.