CAA | న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈశాన్య రాష్ర్టాలతో పాటు కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకు సంబంధం ఉందని, అందుకే సీఏఏను వ్యతిరేకిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. జల్పాయిగురిలో ఆమె మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల ముందు సీఏఏను అమలు చేయడం జిమ్మిక్ అని ఆరోపించారు.
బెంగాల్లో నిర్బంధ క్యాంపులను ఏర్పాటు చేయబోమని ఆమె ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ముందు సీఏఏను అమలు చేయడాన్ని బీజేపీ చేస్తున్న మురికి ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. శరణార్థులను ఓటుబ్యాంకుగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తున్నదని ఆరోపించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి పేద మైనారిటీలు మన దేశంలోకి ప్రవాహంలా వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం గేట్లు తెరిచిందని ఆయన పేర్కొన్నారు.
1947 కంటే ఎక్కువ వలసలు కొనసాగుతాయని, మన దేశంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని తెలిపారు. సీఏఏ అమలుకు వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీఏఏను అమలు చేయబోమని గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని బుధవారం కేరళ మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే సీఏఏను సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నందున తదుపరి తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలను పరిశీలించాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది.
సీఏఏ వివక్షాపూరితం: ఐక్యరాజ్యసమితి
సీఏఏ అమలుపై ఐక్యరాజ్యసమితి, అమెరికా స్పందించాయి. 2019లో తాము చెప్పినట్టుగానే సీఏఏ ప్రాథమికంగా వివక్షతో కూడుకున్నదని, దీని పట్ల ఆందోళన చెందుతున్నట్టు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయ అధికార ప్రతినిధి రాయిటర్స్ వార్తాసంస్థకు వెల్లడించారు. అంతర్జాతీయ మానవ హక్కులను సీఏఏ అమలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయా అనేది తమ కార్యాలయం పరిశీలిస్తున్నదని తెలిపారు. అమెరికా కూడా ఇదే రకంగా స్పందించింది. సీఏఏ అమలు నిబంధనలను పరిశీలిస్తున్నామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మతస్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాల వారిని సమానంగా చూడటం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రమని అభిప్రాయపడ్డారు.