బెంగళూర్ : కర్నాటకలో (Karnataka Polls) త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై లెక్కకుమించి అవినీతి ఆరోపణలతో పాటు పాలనా వైఫల్యాలు ఆ పార్టీకి బలహీనతలుగా మారాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాలు కాషాయ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దక్షిణ కర్నాటకలో ఇప్పటికీ బీజేపీ పరిస్ధితి దయనీయంగా ఉండటం కూడా ప్రధాన అవరోధంగా మారింది.
దక్షిణాదిలో కేవలం కర్నాటకలోనే 2008, 2018లో బీజేపీ అధికారం దక్కించుకుంది. రెండు సందర్భాల్లోనూ కాషాయ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడం గమనార్హం. బీజేపీ రెండు సార్లు కన్నడ సభలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత కొద్ది ఎన్నికల్లో బీజేపీ పలు ప్రాంతాల్లో మెజారిటీ స్ధానాలు కైవసం చేసుకున్నా దక్షిణ కర్నాటక మాత్రం కాషాయ పార్టీని ప్రతిసారీ పక్కనపెడుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ విపక్షాల కంటే బీజేపీ చాలా వెనుకంజలో ఉంది. ఈ ప్రాంతంలో అత్యధికంగా 51 అసెంబ్లీ స్ధానాలుండటం, ఇక్కడ బీజేపీ పరిస్ధితి మెరుగ్గా లేకపోవడంతో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం కాషాయ పార్టీకి సవాల్గా మారింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కర్నాటకలో కేవలం 9 స్ధానాలనే గెలుచుకుంది. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా కలిగిన దక్షిణ కర్నాటకలో ఈ వర్గం సామాజికంగా, ఆర్ధికంగా గట్టి పట్టు కలిగిఉంది. ఇక లింగాయత్లు కర్నాటకలో అధిక జనాభా కలిగిఉన్నా దక్షిణ కర్నాటకలో వొక్కలిగలే అధికం. భారత మాజీ ప్రధాని, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ దేవెగౌడ ఈ ప్రాంతానికి చెందిన నేత కావంతో పాటు వొక్కలిగ వర్గానికి చెందిన నేత. ఇక ఆయన కుమారుడు జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆపై కర్నాటక సీఎంగా గతంలో వ్యవహరించారు.
వొక్కలిగలు జేడీఎస్కు బాసటగా నిలుస్తుండటంతో ఈ ప్రాంతంలో ఆ పార్టీ తిరుగులేని విజయాలు సాధిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ రాష్ట్రవ్యాప్తంగా 18 శాతం ఓట్లు సాధించగా కేవలం ఈ ప్రాంతంలో 38 శాతం ఓట్లు సాధించడం గమనార్హం. ఇక కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్ ఈ ప్రాంతానికి చెందిన వొక్కలిగ నేత కావడంతో కాంగ్రెస్ కూడా దక్షిణ కర్నాటకలో మెరుగ్గానే ఓట్లు సాధించే అవకాశం ఉంది. జేడీఎస్, కాంగ్రెస్ల తరహాలో ఈ ప్రాంతంలో కాషాయ పార్టీకి సరైన నేత కొరవడటం కూడా బీజేపీకి మైనస్గా మారనుంది.
Read More :
India Corona | అప్రమత్తంగా ఉండాల్సిందే.. దేశంలో కొత్తగా 1,249 మందికి కరోనా పాజిటివ్