డెహ్రాడూన్/రిషికేశ్, సెప్టెంబర్ 25: ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి(19) హత్య కేసులో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చేసే దురాగతాలను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం.. ఈ కేసులో మాత్రం హడావుడిగా ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ అక్రమ నిర్మాణమని కూల్చివేయటంపై పెద్ద చర్చ నడుస్తున్నది. రిసార్ట్లో హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేసేందుకే సర్కార్ రిసార్ట్ను ఆఘమేఘాలపై కూల్చివేసిందని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. అంకిత సోదరుడు అజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘రిసార్ట్లో ఆధారాలను నాశనం చేసేందుకే రాత్రికిరాత్రే బుల్డోజర్లతో కూల్చివేశారు’ అని అన్నారు.
తీవ్రంగా కొట్టినట్టు ఆధారాలు
అంకిత శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని, నీట మునిగి చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. ప్రాథమిక నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబసభ్యులు తుది పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. అధికారులు సర్ది చెప్పి అంత్యక్రియలకు ఒప్పించారు. కాగా, అంకిత భండారి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఉత్తరాఖండ్లోని శ్రీనగర్ ఏరియాలో రిషికేశ్-బద్రినాథ్ జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు.