అహ్మదాబాద్, మార్చి 15: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని దేశ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేయగా.. ఇప్పుడు నమ్మి ఓటేసిన గుజరాతీ రైతులనూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రైతులకు పగటి పూట కరెంట్ ఇవ్వాలంటే మరో రెండేండ్లు పడుతుందని రాష్ట్ర మంత్రి కనూభాయ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.
పగటిపూట కరెంటు ఇవ్వాలని 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర రైతులు ఆందోళన బాట పట్టారు. భయపడ్డ బీజేపీ.. మళ్లీ అధికారంలోకి రాగానే, పగటి పూట కరెంటు ఇస్తామని నమ్మబలికింది. దీంతో రైతులంతా ఆ పార్టీకి ఓటేసి గెలిపించారు. కానీ, ప్రభుత్వం ఇప్పుడు మాట దాట వేయడంపై రైతులు, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.