అహ్మదాబాద్, మార్చి 26: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లి వచ్చిన రేపిస్టుకు బీజేపీ రాచమర్యాదలు చేసింది. గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై కూర్చోబెట్టింది. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే.. రేపిస్టుతో వేదిక పంచుకున్నారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపైన గ్యాంగ్ రేప్ జరిగింది. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణి. ఈ కేసులో 11 మంది దోషుల్లో శైలేశ్ చిమన్లాల్ భట్ ఒకడు. 2008లో ఇతడికి జైలుశిక్ష పడింది.
గత స్వాతంత్య్ర దినోత్సవం నాడు వీరిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బిల్కిస్ బానో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఇదిలా ఉండగా శనివారం గుజరాత్లోని దహోడ్ జిల్లా కర్మాడి గ్రామంలో నీటి సరఫరా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ దహోడ్ ఎంపీ జస్వంత్ సిన్హ్ భభోర్, లింఖేడా ఎంఎల్ఏ శైలేశ్ భభోర్ హాజరయ్యారు. వీరితో పాటు రేపిస్టు శైలేష్ చిమన్లాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అంతేకాదు, వేదికపైకి ఎక్కి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే పక్కన కూర్చున్నాడు. గర్భిణీపై అతి దారుణంగా గ్యాంగ్రేప్కు పాల్పడి జైలుకు వెళ్లిన వ్యక్తిని బీజేపీ ప్రజాప్రతినిధులు పక్కన కూర్చోబెట్టుకొని మర్యాదలు చేయడం దుమారం రేపుతున్నది.