పౌరసత్వం లభించక స్వదేశానికి వెళ్లిన 800 మంది పాకిస్థానీ హిందువులు
పౌరసత్వం మంజూరులో కేంద్రం అలసత్వం
న్యూఢిల్లీ, మే 9: హిందూ మతంపై తమదే పేటెంట్ అన్నట్టుగా వ్యవహరించే, వాదించే బీజేపీ మాటలు ఒట్టివేనని మరోసారి తేటతెల్లమైంది. ఎన్నికల్లో లబ్ధి కోసం మతతత్వాన్ని రెచ్చగొడుతూ హిందూ మతాన్ని వాడుకునే ఆ పార్టీకి వాస్తవానికి హిందువులపై ఎంత ప్రేమ ఉందో తెలిపే ఘటన రాజస్థాన్లో జరిగింది. ఇక్కడి పారసౌత్వం లభించక 800 మంది పాకిస్థానీ హిందువులు గత్యంతరం లేక పాకిస్థాన్కే వెళ్లిపోయారు. పౌరసత్వం కోసం వారు పెట్టుకున్న దరఖాస్తు పరిష్కారంలో పురోగతి లేకపోవడంలో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఇక్కడ బతుకుతామంటూ వస్తే..
పాకిస్థాన్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్నామని, భారత పౌరసత్వం ఇస్తే ఇక్కడే బతుకుతామంటూ వేలాది మంది మన దేశానికి వచ్చారు. ఒక్క రాజస్థాన్లోనే 25 వేల మంది వరకు ఉన్నట్టు అంచనా. వీరంతా భారత పౌరసత్వ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది రెండు దశాబ్దాలుగా వేచిచూస్తున్న పరిస్థితి. వీరిలో 800 మంది పాకిస్థానీ హిందువులు గత ఏడాది తిరిగి వెళ్లిపోయారని భారత్లో మైనార్టీ వలసదారుల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ సీమంత్ లోక్ సంఘస్థాన్ పేర్కొన్నది. పౌరసత్వ దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో ఉందని, గడువు ముగిసిన పాకిస్థాన్ పాస్పోర్టులను పోర్టల్ ఆమోదించడం లేదని ఎస్ఎల్ఎస్ అధ్యక్షులు హిందూ సింగ్ సోదా పేర్కొన్నారు. 2021, డిసెంబర్ 14 నాటికి 10,635 పౌరసత్వ దరఖాస్తులు తమవద్ద పెండింగ్లో ఉన్నాయని, వీటిల్లో 7,306 పాక్ నుంచి వచ్చిన వారివని కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలిపింది.