అహ్మదాబాద్ : గుజరాత్ దాదాపు మూడు దశాబ్ధాల నుంచి బీజేపీ ఏలుబడిలో ఉన్నా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఎన్ని వ్యూహాలు రూపొందించినా ఈ నియోజకవర్గాల్లో కాషాయ జెండా రెపరెపలాడలేదు.
27 ఏండ్లుగా కమలనాధులు నిరంతరాయంగా అధికారంలో ఉన్నా ఈ నియోజకవర్గాల్లో బీజేపీ ఇంతవరకూ బోణీ కొట్టలేదు. జన్సంఘ్ హయాంలో ఆపై బీజేపీ ప్రాభవం వెలుగొందినా పలు జిల్లాల్లోని ఈ నియోజకవర్గాలను ఆ పార్టీ ప్రభావితం చేయలేకపోయింది.
బీజేపీ ఇంతవరకూ గెలుపొందని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే..బొర్సద్ (ఆనంద్ జిల్లా), జగదియ (బరూచ్), వ్యర (తపి), 1995 మినహా.. బిలోద (అరవల్లి) మహుధ (ఖేదా), అంక్లవ్ (ఆనంద్), దనిల్మిద (అహ్మదాబాద్), గర్బద (దహోద్ జిల్లా). ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.